భక్తి టీవీ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆధ్యాత్మిక ఉత్సవం కోటి దీపోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్న రాష్ట్రపతి ఈ నెల 21వ తేది సాయంత్రం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. 22వ తేదిన హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో జరిగే లోక్ మంతన్ – 2024 ప్రాంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
రాంగోపాల్ వర్మకు నోటీసులు
టాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ‘వ్యూహం’ ప్రమోషన్స్లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ పోస్టులు పెట్టాడని టీడీపీ నాయకుడు రామలింగం ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ యాక్ట్ కింద రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసు విషయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మద్దిపాడు పోలీసులు.. నోటీసులు జారీ చేశారు. ఈనెల 19వ తేదీన ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీస్కి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష
ఈ నెల 21, 22 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజులపాటు హైదరాబాద్లో పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించేందుకు మాన్యువల్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
పోలీసు శాఖ తగిన భద్రతా ఏర్పాట్లు, సరైన ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు అన్ని వేదికల వద్ద తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. వైద్యారోగ్యశాఖ సహాయక సిబ్బందితోపాటు అర్హులైన వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రపతి బస చేసే ప్రదేశం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ శాఖను ఆదేశించారు. అన్ని వేదికల వద్ద అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ ను ఆదేశించారు.
నాగార్జున పరువునష్టం దావా కేసులో సురేఖ కౌంటర్
సినీనటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో న్యాయస్థానం ఆదేశం మేరకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చేశారు. నాంపల్లి స్పెషల్ కోర్టులో సురేఖ తన వాదనలు వినిపిస్తూ కౌంటర్ వేశారు. ఆమె తరపున న్యాయవాది గురుమిత్ సింగ్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. రాజకీయంగా కేటీఆర్పై విమర్శలు చేయబోయిన కొండా సురేఖ.. సినీ నటుడు నాగార్జున కుటుంబసభ్యులను ప్రస్తావిస్తూ అనుచిత ఆరోపణలు చేశారు. దీనిపై అప్పట్లో సినీరంగ ప్రముఖులంతా ఒక్కటయ్యారు. కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, నాగార్జున మాత్రం నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఇప్పుడు కొండా సురేఖ కౌంటర్ దాఖలు చేశారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని సురేఖ న్యాయస్థానానికి వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
డికె అరుణ లగచర్ల పర్యటనలో ఉద్రిక్తం
ఎంపీ డీకే అరుణ కొడంగల్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఫార్మాసిటీ రగడ, దాడులు, అరెస్టులు, ఉద్రిక్తత నేపథ్యంలో డీకే అరుణ ఇవాళ లగచర్ల వెళ్లారు. అయితే, మధ్యలోనే డికె అరుణను పోలీసులు అడ్డుకున్నారు. మన్నెగూడ వద్ద డీకే అరుణను అడ్డుకొని లగచర్లకు వెళ్లొద్దంటూ కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయని ముందుకు వెళ్లనీయబోమని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల తీరును నిరసిస్తూ డీకే అరుణ రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. డీకే అరుణ రోడ్డుపై బైఠాయించడంతో ఆమెకు మద్దతుగా బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. దీంతో, మన్నెగూడ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
బుల్డోజర్ చర్యలు తగవు – సుప్రీంకోర్ట్
నిందితుల ఆస్తులను ఏకపక్షంగా బుల్డోజర్ తో కూల్చివేయడం వంటి చర్యలు తగవని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అధికారులే న్యాయమూర్తుల్లా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు… అధికారులు కూడా నిందితులపై మితిమీరిన చర్యలు తీసుకోరాదని సుప్రీంకోర్టు సూచించింది. నిందితుల ఇళ్లను కానీ ఆస్తులను కానీ కూల్చే అధికారం ప్రభుత్వాలకి లేదని సుప్రీం స్పష్టం చేసింది. కూల్చివేతలకు మతంతో సంబంధం ఉండకూడదని సుప్రీంకోర్టు తెలియచేసింది.
రెండు దశల్లో నాలుగు కారిడార్లతో విశాఖ మెట్రో
విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు సంబంధించి సమగ్ర రవాణా ప్రణాళిక (సీఎంపి) సిద్దం చేసినట్లు పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేసారు…ఈ ప్రణాళికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు..కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పై ముందుకెళ్తామన్నారు..అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖపట్నంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు,పీజీవీఆర్ నాయుడు,వెలగపూడి రామకృష్ణ బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలకత్తా మెట్రో రైల్ తరహాలో వందశాతం కేంద్రప్రభుత్వం భరించేలా రైల్వే శాఖకు అప్పగించేలా కేంద్రం ముందు ప్రతిపాదన ఉంచామన్నారు. రెండు దశల్లో నాలుగు కారిడార్లలో మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు.మొదటి దశలో 46.23 కిమీ మేర మూడు కారిడార్లలో నిర్మాణం చేస్తామన్నారు..మొదటి కారిడార్ ను స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకూ 34.4 కిమీ మేర రెండో కారిడార్ లో గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకూ 5.07 కిమీ మేర మూడో కారిడార్ లో తాటిచెట్ల పాలెం నుంచి చిన వాల్తేరు వరకూ 6.75 కిమీ మేర ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్దం చేసామన్నారు.మొత్తంగా 46.23 కిమీ మేర 42 స్టేషన్లతో నిర్మించే ప్రాజెక్ట్ కు 11,498 కోట్లు ఖర్చవుతుందని అంచానా వేసామన్నారు.ఇక రెండో దశలో కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ వరకూ 30.67 కిమీ మేర 12 స్టేషన్ల తో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసామన్నారు మంత్రి నారాయణ.
రెండేళ్లలో ట్రైబల్ యూనివర్సిటీ – మంత్రి లోకేష్
రెండు సంవత్సరాల్లో కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాసనసభలో స్పష్టం చేసారు. పెండింగ్ లో ఉన్న విద్యా సంస్థల పురోగతిపై శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ట్రైబల్ వర్సిటీ స్థలం మర్చి గత ఐదేళ్లు పనులు ముందుకు సాగకుండా జాప్యం చేసారని లోకేష్ తెలిపారు. 2019లో ఎక్కడైతే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించమో అక్కడే రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేసారు. నిర్మాణ దశలో ఉన్న విద్యా సంస్థలన్నిటికీ పెండింగ్ లో ఉన్న రహదార్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఆర్ఆర్ఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఎంపికయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పదవిని రఘురాం కృష్ణంరాజు ఆశించగా ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే రఘురాం కృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ గా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం కేటీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కలెక్టర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్ తో నరేందర్ రెడ్డి తరచు ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా కాల్ డేటా లో రుజువు అవడంతో పోలీసులైన అరెస్ట్ చేశారు