కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో ఉన్న తెలుగువాళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. ఈమేరకు ఆయన ఎక్స్లో ట్వీట్స్ చేశారు.
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురికి స్థానం దక్కింది. వారిలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. వీరితో పాటు మంద కృష్ణ మాదిగ, మాడుగుల నాగఫణి శర్మ, కేఎల్ కృష్ణ, మిరియాల అప్పారావు, వాదిరాజు రాఘవేంద్రాచారి పంచముఖిలను కూడా పద్మ పురస్కారాలు వరించాయి. దీంతో, పద్మ అవార్డులకు ఎంపికైన ప్రముఖులకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. “విఖ్యాత వైద్యులు డాక్టర్ నాగేశ్వర్రెడ్డి గారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చేసిన పరిశోధనలు వైద్యరంగంలో గొప్పగా నిలిచిపోతాయి. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు ఆయన. రోగులకు ఆత్మీయత పంచడమే కాదు, వారు తిరిగి కోలుకునేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే గొప్ప మనసు ఆయనది. కొత్త కొత్త వ్యాధులకు చికిత్సనందించడంలో నాగేశ్వర్రెడ్డి సేవలు విశేషమైనవి. అత్యాధునిక వైద్య పద్ధతులు, చికిత్సా విధానాలను తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా విస్తరించడంలో ఆయనది కీలక పాత్ర. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని దేశం గొప్పగా గౌరవించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం.” అంటూ డాక్టర్ నాగేశ్వరరెడ్డికి వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు.
అలాగే సినీనటుడు నందమూరి బాలకృష్ణకు కూడా వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. బాలకృష్ణతో పాటు మిగతా పద్మ అవార్డు విజేతలను అభినందిస్తూ జగన్ మరో ట్వీట్ చేశారు. “ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు. డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (వైద్యం), నందమూరి బాలకృష్ణ (కళలు), మంద కృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు), మాడుగుల నాగఫణి శర్మ (కళలు), కేఎల్ కృష్ణ (విద్యా, సాహిత్యం), మిరియాల అప్పారావు (కళలు), వాదిరాజు రాఘవేంద్రాచారి పంచముఖి (విద్య, సాహిత్యం)లకు అభినందనలు” అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.