కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని.. వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఆరోపించింది. తాము విద్యార్థులకు అండగా నిలుస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 5వ తేదీన ‘ఫీజు పోరు’ పేరుతో ఉద్యమానికి రెడీ అవుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆ పార్టీ నేతలు తాజాగా విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు. జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఫీజు పోరు ఉద్యమ కార్యక్రమంలో భాగంగా.. ఫిబ్రవరి 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో.. విద్యార్ధులు, పేరెంట్స్తో కలిసి వైసీపీ నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు ఇవ్వనున్నారు.
కూటమి ప్రభుత్వం విద్యా దీవెన పథకం కింద రూ.2,800 కోట్లు, వసతి దీవెన పథకం కింద రూ.1100 కోట్ల స్కాలర్షిప్ అందించాల్సి ఉంది. రెండూ కలిపి దాదాపు రూ.3900 కోట్లు ప్రభుత్వం బకాయి పడిందని వైసీపీ నేతలు ఆరోపించానారు. కూటమి సర్కారు నిర్లక్ష్యం కారణంగా.. కొన్ని చోట్ల కాలేజీల యాజమాన్యాలు విద్యార్ధులను క్లాస్లకు రానివ్వడం లేదని.. మరికొన్ని చోట్ల సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పేద విద్యార్ధులు చదువులు మానుకుని కూలీ చేసుకోవాల్సిన పరిస్థితిని ఏపీలో కూటమి ప్రభుత్వం కల్పిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి పేద విద్యార్ధి ప్రపంచ స్థాయిలో అవకాశాలకు పోటీ పడాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి భావిస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు మాత్రం విద్యార్ధుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని వైసీపీ లీడర్లు ఫైర్ అవుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి పక్కాగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ల పిల్లల ఫీజులు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ను మరింత పటిష్టంగా అమలు చేశారు. 2019లో చంద్రబాబు మాత్రం రూ.2800 కోట్లు బకాయిలు పెట్టి దిగిపోయారు. సీఎంగా జగన్ ఆ బకాయిలు మొత్తం చెల్లించారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
వైఎస్ జగన్ కంటే తాము ఇంకా ఎక్కువగా మేలు చేస్తామంటూ గడిచిన ఎన్నికల్లో ప్రజలను నమ్మించిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి ప్రజలను అష్టకష్టాలు పెడుతున్నాయంటున్నారు వైసీపీ నేతలు. తీరా గద్దెనెక్కిన తరువాత విద్యార్ధుల ఉసురు పోసుకుంటున్నారని వైసీపీ విమర్శించింది. ప్రతిపక్షంగా వైసీపీ ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కచ్చితంగా ప్రభుత్వ మెడలు వంచి విద్యార్ధులకు న్యాయం జరిగేలా పోరు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పటికైనా విద్యార్ధులను ఆదుకునేందుకు ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 5వ తేదీ లోగా మొత్తం బకాయిలను చెల్లించకపోతే ఈ ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఇచ్చిన హామీలను ఎగ్గోట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న దిగజారుడు రాజకీయాలను చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.