పిఠాపురంలో అధికార పార్టీపైనే కేసులు.. దేనికి సంకేతం..?
గత రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది పిఠాపురం. డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి.. సహజంగానే పిఠాపురం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.. అందులో కొత్తేముంది..? వింతేముంది..? అని ప్రశ్నించవచ్చు. కానీ పిఠాపురం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ కావడానికి కారణం పవన్ కళ్యాణ్ ఎంత మాత్రమూ కాదు. మాజీ ఎమ్మెల్యే వర్మ, ప్రస్తుత, కొత్త ఎమ్మెల్సీ నాగబాబు. అవును వీరిద్దరి వల్లే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం వార్తల్లో నిలుస్తోంది.
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నాగబాబు తన తొలి పర్యటనను పిఠాపురంలో పెట్టుకున్నారు. పర్యటించడమే కాదు.. భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే రూ. 40 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ క్రమంలో నాగబాబు పాల్గొన్న కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ దూరంగానే ఉన్నా.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. మరి ముఖ్యంగా వర్మ అనుచరులు మాత్రం ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు.. అడుగడుగునా జిందాబాద్ వర్మ అంటూ నినాదాలు చేశారు. దీంతో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగింది. ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. అయితే ఇదంతా ఓ ఎత్తు అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలే మరో లెవల్లో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిత్రపక్షం మీద ఫిర్యాదు చేయడం ఎత్తు అయితే.. దీనికి మించి మరో పరిణామం చోటు చేసుకుంది. స్థానిక ఏఎస్ఐ కూడా టీడీపీ కార్యకర్తల మీద ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించేలా టీడీపీ కేడర్ వ్యవహరించారంటూ సదురు ఏఎస్ఐ ఫిర్యాదు సారాంశం.
పిఠాపురం టీడీపీ కేడర్ మీద ఫిర్యాదులంటే.. అది కచ్చితంగా వర్మ అనుచరుల మీదేననేది క్లారిటీగా అర్థమైపోతోంది. అంటే పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ మనుషులు నేరుగా వర్మ మనుషుల మీద ఫిర్యాదు చేసినట్టే లెక్క. ఈ పరిణామాన్ని చాలా సీరియస్సుగానే తీసుకోవాలనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు వర్మ కేంద్రంగా.. పిఠాపురంలో జరిగిన పరిణామాలు ఓ ఎత్తు అయితే.. ఇప్పుడు కేసుల ఎపిసోడ్ మరో ఎత్తు అంటున్నారు. ఇది కచ్చితంగా వర్మకు కాకరేపి.. రెచ్చగొట్టే పరిణామమేనని చెప్పాలి. ఇప్పటికే వర్మ తోక తొక్కిన తాచులా బుసలు కొడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆ బుసలు అంతా గుసగుసలుగానే ఉన్నాయి. ఇప్పుడు వ్యవహరం కేసుల వరకు రావడంతో బుసలు బహిర్గతం అవుతాయనే భావన బలంగానే వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలతో వర్మ విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పొమ్మనకుండా పొగపెట్టారనేది ఆ ఆసక్తికర చర్చల సారాంశం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ను కాదని.. చంద్రబాబు.. టీడీపీ అధిష్టానం వర్మ విషయంలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో వర్మకు త్వరలోనే టీడీపీలో ఎండ్ కార్డ్ పడుతుందా..? దానికి ఇదే ఇదే సంకేతమా.. ? అనే చర్చ యమ జోరుగా సాగుతోంది.
వర్మకు ఎండ్ కార్డ్ పడనుందా..?
ఇదే సమయంలో మరో చర్చా జరుగుతోంది. 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం దొరబాబు.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. జనసేనలో చేరారు. ప్రస్తుతం పిఠాపురం వైసీపీకి ఎలాంటి నేత లేకుండా ఖాళీగా ఉంది. ఈ పరిస్థితుల్లో వర్మ కనుక వైసీపీ వైపు మొగ్గు చూపితే.. వైసీపీ వర్మను ఎగరేసుకుపోవడం గ్యారెంటీ అనే చర్చ అటు పిఠాపురంలోనే కాదు.. ఏపీ రాజకీయ వర్గాల్లోనూ జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని టీడీపీ నేత వైసీపీలోకి రావడమంటే.. ఇది రాజకీయంగా విపరీతమైన చర్చకు దారి తీసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా.. టీడీపీ కేడర్లో కూడా మిత్రపక్షం మీద నెగెటివ్ ఇంప్రెషన్ కలగడానికి స్కోప్ ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో వర్మ వైసీపీకి వెళ్లడానికి రెడీగా ఉంటే.. తీసుకోవడానికి తామూ రెడీగానే ఉన్నామని వైసీపీ ఇప్పటికే సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వనప్పటికీ.. పిఠాపురంలో వర్మకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు కచ్చితంగా కీలక టర్న్ తీసుకోవడం ఖాయమని.. ఆ టర్న్ వైసీపీ వైపే ఉండడం ఖాయమనే చర్చ రంజుగా సాగుతోంది.