భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తా లేక పాకిస్థాన్ కొత్త కుట్రకు తెరలేపుతుందా? దీని కోసం బంగ్లాదేశ్ వేదికగా వ్యూహాలు రచిస్తుందా? బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా కుట్రలకు తెరలేపుతోందా? ఈ ప్రశ్నలన్నింటికి ఔననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే కేంద్రం ఇప్పుడు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించింది. అదనపు బలగాలను మోహరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మయన్మార్ సరిహద్దుల్లో కూడా ఈ హైఅలర్ట్ కొనసాగుతోంది.
ఇటీవల పాకిస్థాన్తో బంగ్లాదేశ్ దోస్తీ పెరుగుతోంది. దీనికి తోడు ఆ దేశంలో ISI ప్రభావం కూడా పెరుగుతోంది. భారత్-పాక్ తీవ్ర ఉద్రిక్తతల సమయంలో బంగ్లాదేశ్లో పర్యటించే పాక్ ఆర్మీ అధికారుల సంఖ్య కూడా పెరుగుతున్న విషయాన్ని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. భారత్ పాక్పై దాడులు చేయడానికి ముందే బంగ్లాదేశ్ సరిహద్ధుల్లో అలజడులు సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారనే విషయాన్ని నిఘా వర్గాలు పసిగట్టాయి.
బెంగాల్లోని ముర్షిదాబాద్లో జరిగిన అల్లర్లకు బంగ్లాదేశ్లోని రాడికల్ గ్రూప్లే కారణమని అనేక అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎలాంటి ఛాన్స్ తీసుకునేందుకు సిద్ధంగా లేవు. అందుకే భారత్-బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించి భద్రతను పెంచారు.
దాయాది దేశం కుటిల నీతుల గురించి తెలిసిందే. నేరుగా యుద్ధం చేసే సత్తా లేక ఇప్పటికే దేశంలో అనేక అలజడులు సృష్టిస్తోంది. పహెల్గామ్ దాడుల్లో హిందూ, ముస్లింల మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ వైపు నుంచి నరక్కుని రావాలని చూస్తోంది. మరోవైపు చైనా నుంచి కూడా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది.