పరిస్ధితులు చక్కదిద్దిన దిల్ రాజు
సంధ్యా ధియేటర్ తొక్కిసలాట తదనంతర పరిణామాలకు సంబంధించి స్టేక్ హోల్డర్లందరూ ఇప్పుడు సంయమనం పాటిస్తున్నారు. ప్రధానంగా సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు, ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు అల్లు అర్జున్ విషయంలో ఎవరు ఇష్టమొచ్చినట్లు వాళ్ళు మాట్లాడవద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సీయం రేవంత్ రెడ్డి మొన్ననే సంధ్యా ధియేటర్ కేసుతో సంబంధం లేని ఏ పోలీసు అధికారి ఈ విషయంపై మాట్లాడవద్దని హెచ్చరిక చేశారు. అలాగే శాసనసభ్యులు, కాంగ్రెస్ నేతలు కూడా ఈ కేసు విషయంలో సంయమనం పాటించాలని సూచించారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ కూడా కాంగ్రెస్ నేతలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు పలువురికి ఫోన్లు చేసి మరీ అల్లు అర్జున్ విషయం ఎవరూ మీడియా ముందు మాట్లాడ వద్దని ఆదేశించారు. మరో పక్క సినీ పరిశ్రమ నుంచి కూడా సంయమన గాయం వినిపిస్తోంది. మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా సున్నితమైన విషయాలపై మా సభ్యులు ఎవరూ స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలపై ఎవరూ మాట్లాడకపోవడమే మంచిదని తెలిసీ తెలియక చేసే ప్రకటనల వల్ల సంబంధిత వ్యక్తులకు మరిన్ని ఇబ్బందులు కలిగించినవారిమవుతామని విష్ణు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సీనీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో స్ధిర పడటానికి మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కారణమని, అలాగే ప్రభుత్వాలు అన్నీ సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహద పడ్డాయని మంచు విష్ణు అభిప్రాయ పడ్డారు. చట్టం తన పని తాను చేసుకు వెళుతందని మా సభ్యులందరూ సంయమనంతో ఉండాలని మంచు విష్ణు అన్నారు. అల్లు అర్జున్ వ్యవహారంలో అన్ని వర్గాలు సంయమనంతో వ్యవహరించాలని అందరూ గప్ చుప్ గా ఉండాలని నిర్ణయించుకుంటే మరో పక్క తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన పని తాను చేసుకుపోతున్నారు. ఆయన అమెరికా నుంచి వచ్చీ రాగానే సీయం రేవంత్ రెడ్డిని కలవడమే కాకుండా శ్రేతేజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్ధితిపై డాక్టర్లతో మాట్లాడి, శ్రీతేజ తండ్రి భాస్కర్ ను కలసి అతనితో కలసి మీడియాతో మాట్లాడారు. ఆతరువాత సినీ పరిశ్రమ ముఖ్యలతో కూడా మాట్లాడి గురువారం సీయం అపాయింట్మెట్ కూడా ఫిక్స్ చేశారు. మొత్తం మీద గత ఇరవై రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప ప్రీమియర్ షో సృష్టించిన టర్బోలెన్స్ ని దిల్ రాజు రంగంలోకి దిగి కంట్రోల్లోకి తెచ్చారు.