పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని, పారిశ్రామిక వేత్తలతో కలిసి నడుస్తామని, ప్రభుత్వం తరపున తాము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టు కుంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. తెలంగాణ లో పెట్టుబడులు పెట్టాలని బయో ఏషియా 2025 వేదికగా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన “బయో ఏషియా 2025” ముగింపు, స్టార్టప్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయో ఏషియా 2025 సదస్సు కు ప్రభుత్వం ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందన వచ్చిందన్నారు. బయో ఏషియా చరిత్రలో ఈ ఏడాది సదస్సు ఒక మైలు రాయిగా నిలుస్తుందన్నారు. దేశ, విదేశాల నుంచి 4వేల మంది ఫార్మా, హెల్త్ కేర్ ఇండస్ట్రీ లీడర్స్, పాలసీ మేకర్స్, ఆవిష్కర్తలు హాజరయ్యారని చెప్పారు. హెల్త్, ఫార్మా రంగాలకు చెందిన 100 మంది నిపుణులు.. ఆయా రంగాల్లో నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
ఈ సదస్సులో 200 కు పైగా బీ టూ బీ (బిజినెస్ టూ బిజినెస్) మీటింగ్స్ జరిగాయని, గతేడాది కంటే ఈసారి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని, అమెరికాకు చెందిన బయో టెక్నాలజీ దిగ్గజ సంస్థ “ఆమ్జెన్” తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టిందన్నారు. ఈ సంస్థ ఏర్పాటు వల్ల సుమారు మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ ఏడాది సదస్సుకు దేశ భవిష్యత్తును మార్చే సత్తా ఉన్న ప్రతిభ గల యువ ఆవిష్కర్తలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారన్నారు. వారి ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిన ఈ ఆవిష్కరణలు ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తాయని ఆకాంక్షించారు. మొత్తం 84 స్టార్టప్స్ ఈ ఏడాది సదస్సు లో పాల్గొన్నాయని శ్రీధర్ బాబు చెప్పారు.
ఆవిష్కరణలకు అండగా ఉండేందుకు, కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు, పరిశ్రమలతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి దుద్ధిళ్ల ప్రకటించారు. తెలంగాణను నాణ్యమైన మానవ వనరులకు హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్ పై దృష్టి సారించామని చెప్పారు. సంబంధిత రంగంలో అనుభవమున్న 4 పరిశ్రమల సహకారంతో “సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ” పేరిట ప్రత్యేక కోర్సును ప్రారంభించామన్నారు. మొదటి బ్యాచ్ లో 140 మంది విద్యార్థులు తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారని శ్రీధర్బాబు చెప్పారు. వీరిలో 82 మంది అమ్మాయిలే ఉండటం విశేషమన్నారు. 60 శాతం మంది అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే అని.. సగం మంది తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదని అయినా వాళ్ల పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు దొరుకుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు కొదువ లేదని, అలాంటి మట్టిలో మాణిక్యాల ను వెలికి తీసి.. వారికి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చి.. వారిని ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్ గా తయారు చేయాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
హార్ట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ గా మారిన జీనోమ్ వ్యాలీ లో “వ్యాక్సీన్ టెస్టింగ్ ఫెసిలిటీ” ని కేంద్రం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే ఇక్కడి కంపెనీలకు ఎంతో మేలు జరుగుతుందని శ్రీధర్ బాబు చెప్పారు.