బీఆర్ఎస్ సభ్యుడు పల్లాకు మంత్రి శ్రీధర్బాబు కౌంటర్
ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని, ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయ్యిందని ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు అన్నారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్ఎస్ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన ఆరోపణలకు సమాధానం చెపుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలు నిర్వహించడానికి రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, ఆ మొత్తాన్ని పెంచాలని అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మీరేం చేశారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. అధికారంలో ఉన్న పదేళ్ళలో అంటే 2014 నుంచి 2023 వరకూ ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలను నిర్వహించలేదని శ్రీధర్బాబు ఎత్తి చూపారు. తెలంగాణ అస్ధిత్వాన్ని కాపాడే బాధ్యతను మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంలో దుద్దిళ్ళ శ్రీధర్బాబు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. అనుభవం కలిగిన గౌరవ సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి సభలో అసత్యాలు మాట్లాడకుండా, రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి శ్రీధర్బాబు కోరారు.
ఫార్ములా ఈ రేసుకి పేమెంట్ జరిగిన తీరునే తప్పుపడుతున్నాం…
ఫార్ములీ ఈ రేసును హైదరాబాద్లో నిర్వహించటాన్ని తమ ప్రభుత్వం ఎప్పుడూ తప్పుపట్టలేదని… ఆ కంపెనీకి పేమెంట్ జరిగిన తీరుని మాత్రమే తాము తప్పుపట్టామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పేమెంట్ ప్రొసీజర్ సరిగా లేనప్పుడు ఫార్ములా ఈరేసును కొనసాగించలేమని తెలిపారు. హైదరాబాద్ వేదికగా మే నెలలో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతాయని ఈ పోటీల్లో 140 దేశాలు పాలుపంచుకోనున్నాయని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు.