తెలుగు సిని పరిశ్రమ ప్రతినిధులకు స్పష్టం చేసిన సీయం, డిప్యూటీ సీయం
బడుగు, బలహీన, మైనారిటీ, దళిత, విద్యార్థుల కోసం తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం ఎంతటి చిత్తశుద్దితో ఉందనే విషయం గురువారం సినీ ప్రముఖులతో జరిగిన సమావేశం మరో సారి రుజువైంది. సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వ స్పందన పక్కన పెడితే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు ప్రభుత్వ అలోచనలను సుస్పంష్టంగా సినీ పరిశ్రమ ప్రతినిధులకు వివరించారు. ప్రధానంగా అట్టడుగు వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచడానికి సినీ పరిశ్రమ నుంచి విద్యా సెస్ రూపంలో ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలనుకుంటున్నట్లు సీనీ ప్రముఖులకు చెప్పారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో 55లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వారిలో 50 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారని వీరందరికీ ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు వివరించారు. 200 కోట్ల రూపాయల వ్యవయంతో 119 నియోజకవర్గాల్లో ఒక్కో పాఠశాల నిర్మించాలనుకుంటున్నట్లు వారికి తెలిపారు డిప్యూటీ సీయం. వీటి కోసమే సినీ పరిశ్రమపై కొంత సెస్ విధించాలని నిర్ణయించినట్లు సీయం, డిప్యూటీ సీయంలు సీనీ ప్రముఖులకు తేటతెల్లం చేశారు. ఇందుకు మీ నుంచి పూర్తి సహకారం కావాలని సీనీ ప్రతినిధులను సీయం, డిప్యూటీ సీయంలు కోరారు. సినీ అభిమానుల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారని వారి భవిష్యత్తును తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుగా ప్రభుత్వం భావిస్తోందని అందుకు మీ సహకారం కూడా కావాలని డిప్యూటీ సీయం భట్టి సీనీ ప్రముఖులను కోరారు. సమగ్ర కుటుంబ సర్వే, డ్రగ్స్ నిర్మూలన వంటి కార్యక్రమాల్లో కూడా సినీ పరిశ్రమ బాధ్యతగా తీసుకుని పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం చెయ్యాలని సీయం, డిప్యూటీ సీయంలు ఈ సందర్భంగా సీనీ హీరోలకు పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమకు ఏదైనా మేలు జరిగిందంటే అది కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని… అదే వారసత్వాన్ని మా ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని సమావేశానికి హాజరైన సినీ పరిశ్రమ ప్రతినిధులకు సీయం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క మల్లులు హామీ ఇచ్చారు.