ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా ఇవాళ ప్రజాదర్బార్ నిర్వహించారు. నాలుగు రోజుల పర్యటనకు పులివెందుల వెళ్లిన జగన్..మూడోరోజు తన క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఒక్క వైఎస్ఆర్ జిల్లా నుంచే కాకుండా రాయలసీమ జిల్లాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. తమ సమస్యలు చెప్పుకున్నారు. పెద్ద ఎత్తున జగన్కు వినతిపత్రాలు సమర్పించారు.
ఊహించని రీతిలో జనం పులివెందుల జగన్ క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారని తెలుసుకొని సమీప జిల్లాల నుంచి జనం పోటెత్తారు. దీంతో, తనను కలవడానికి వచ్చిన వాళ్లందరినీ జగన్ ఓపిగ్గా కలిశారు. వాళ్ల సమస్యలు విన్నారు. వాళ్లు ఇచ్చిన వినతిపత్రాలను స్వీకరించారు. వాళ్ల సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.
ఉదయం ప్రజాదర్బార్ మొదలైన సమయంలో కాస్త కలకలం చెలరేగింది. పోలీసులు అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడంతో జనం ఒక్కసారిగా క్యాంప్ ఆఫీస్లోపలికి చొచ్చుకువచ్చారు. ఈ సమయంలో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ప్రజలను చెదరగొట్టారు. సమాచారం తెలుసుకున్న రోప్పార్టీలు అక్కడికి వచ్చి…జనాన్ని కంట్రోల్ చేశాయి. పోలీసులు.. జనం తోసుకోకుండా.. రెండు క్యూలైన్లు ఏర్పాటు చేసి వరుసలో నిల్చోబెట్టారు. జగన్ను కలిసేందుకు వచ్చిన వాళ్లందరినీ ఆయనతో కలిసేలా ఏర్పాట్లు చేశారు.
జగన్ను కలిసేందుకు వచ్చిన వాళ్లలో అభిమానులు పెద్దమొత్తంలో ఉన్నారు. చాలామంది ఆయనకు ఆలస్యంగా జన్మదినశుభాకాంక్షలు తెలపడంతో పాటు.. క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఉదయం మొదలైన ప్రజాదర్బార్కు.. మధ్యాహ్నం భోజన సమయంలో కాసేపు విరామం ఇచ్చారు. భోజన విరామం తర్వాత మళ్లీ సాయంత్రం దాకా ప్రజాదర్భార్ కొనసాగింది.
ఈ క్రమంలోనే వైఎస్ జగన్ వీరాభిమాని ఒకరు ఆయన్ను కలిశారు. తన రక్తంతో వైఎస్ జగన్ చిత్రపటం తీర్చిదిద్దాడు. తనపేరు అజయ్ రెడ్డి అని.. ఆ ఫ్రేమ్ను ప్రేమగా జగన్కు చూపించారు. జగన్తో స్వయంగా సంతకం చేయించుకొని తిరిగి ఆ చిత్రపటాన్ని తీసుకెళ్లాడు. తనమీదున్న అభిమానానికి జగన్ పొంగిపోయారు. సొంతకాళ్లపై నిలబడాలని, భవిష్యత్తులో బాగా స్థిరపడాలని.. నలుగురికి మేలు చేయాలని మార్గనిర్దేశం చేశారు.