ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసు..
ఇండస్ట్రీలో నాగార్జున స్టైలే వేరు..ఎప్పుడూ జాలీగా, నవ్వుతూ, హ్యాండ్ సమ్ గా కనిపించే నాగార్జునకి ఎప్పుడో కానీ కోపం రాదు.. అందరినీ నవ్వుతూ పలకరించడం ఆనవాయితీ. ఆయన ఏ ఎండకాగొడుగు పడతాడు అంటారు గిట్టని వాళ్లు.. అయినా నాగార్జున ఇవాళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఎందుకో తెలుసా?
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..
తెలంగాణ తో ఆయనకు రెండు సార్లు, రెండు విషయాల్లో ఇబ్బందులు వచ్చాయి. అందులో ఒకటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. దానిపై కోర్టులో ఇంకా న్యాయ పోరాటం జరుగుతోంది. రేవంత్ ప్రభుత్వం వచ్చీ రాగానే హై డ్రాను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మొదలు పెట్టింది. నగరంలో చాలా చోట్ల కూల్చివేతలు స్పీడుగా జరిగాయి. అయితే ఈ కూల్చివేతలకు మొదటి అడుగు పడింది మాత్రం నాగార్జున ప్రోపర్టీతోనే. నాగార్జునకు ఉన్న ఎన్ కన్వెన్షన్ ను చెప్పా చేయకుండా, కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకునే టైమ్ కూడా లేకుండా రేవంత్ సర్కార్ కూల్చేసింది. నాగార్జున సాఫ్ట్ టార్గెట్ అయ్యాడని అందరూ అప్పట్లో సింపతీ చూపించారు కూడా. అయితే కేవలం ట్విటర్ ద్వారానే తన అభిప్రాయాన్ని చెప్పిన నాగార్జున అప్పడు కూడా తీవ్రంగా ఏం స్పందించలేదు. నిజానికి అంత పెద్ద కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేస్తే మరో హీరో అయితే చాలా తీవ్రంగా రియాక్ట్ అయి ఉండేవాడు..కానీ నాగార్జున మాత్రం తన అసంత్రుప్తిని పెద్దగా వ్యక్త పరచలేదు.
కొండా సురేఖ వ్యవహారం..
ఇక రెండో విషయం మంత్రి కొండా సురేఖ వ్యవహరించిన తీరు.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు కేటీఆర్ పై ఆరోపణలు చేసే క్రమంలో నాగార్జున కుటుంబాన్ని కూడా వీధికి లాగింది. నాగార్జున పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా, చివరకు మాజీ కోడలు సమంతాని, నాగ చైతన్యని కూడా ఈ దుమారంలోకి లాగేశారు. అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారు. నాగార్జున కుటుంబం ఒంటరిదైపోయింది. ఇంతలో జరిగిన డ్యామేజీ తెలుసుకుని సురేఖ కూడా సారీ చెప్పారు. ఆమెను కేబినెట్ నుంచి తప్పిస్తారు అనే టాక్ కూడా అప్పట్లో వచ్చింది. కొందరు పెద్దలు కల్పించుకుని పరువు నష్టం దావా వేయాలని నాగార్జునకు చెప్పడంతో నాగర్జున, చైతన్య ఇద్దరూ నాంపల్లిలో పరువు నష్టం దావా వేశారు. దీనిపై కూడా విచారణ ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. నిజానికి ఇంత దారుణంగా అవమానించిన ప్రభుత్వంతో ఎవరూ చర్చలకు కూడా వెళ్లరు. కానీ నాగార్జునకి ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసు. అందుకే ఇవాల్టి ఇండస్ట్రీ ప్రముఖులతో కలసి సీఎం రేవంత్ ని కలిశారు. మొక్కుబడిగా కాదు. ఆయనకు శాలువా కప్పి, నవ్వుతూ చక్కగా ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. అందుకే ఇవాల్టి ఇండస్ట్రీ , సీఎం మీట్ లో ఆయనే హై లైట్ గా నిలిచారు. దటీజ్ నాగార్జున…