తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయాలను ప్రజలకు వివరించాలన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్ట అధికారం లోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి చిట్టాను రేవంత్ వివరించారు. జనవరి 26 నుంచి రైతు భరోసా అందించబోతున్నామని చెప్పారు. వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.12వేలు అందించబోతున్నామన్నారు. అలాగే, కొత్త రేషన్ కార్డ్ లు ఇవ్వబోతున్నామని చెప్పారు. మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామన్నారు సీఎం. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, ఏడాదిలో రూ.54వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశామని చెప్పారు. రూ .500 లకే సిలిండర్ ఇస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వివరించారు. మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని.. ఈ పథకంకోసం ఇప్పటి వరకు 4000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీ కి చెల్లించిందన్నారు.
ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపామన్నారు. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ లో ఏకగ్రీవ తీర్మానం చేశామని, మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. అందుకే, పాతబస్తీలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ కి మన్మోహన్ సింగ్ పేరు పెట్టామన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
గాంధీభవన్లో జరిగిన పీసీసీ ప్రత్యేక సమావేశానికి ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్, మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.