తాము రైలును హైజాక్ బంధించిన ప్రయాణీకుల్లో 214 మందిని హతమార్చినట్టు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఇందుకు పాక్ ప్రభుత్వం మొండిపట్టుదలే కారణమని… తాము కాదంటూ ప్రకటించింది. తాము విధించిన 48 గంటల డెడ్లైన్ను పాక్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని.. పాక్ ఆర్మీని చూసుకొని రెచ్చిపోయిందని.. దానికి పర్యవసానమే ఈ దారుణానికి కారణమని బీఎల్ఏ స్పష్టం చేసింది.
పాక్ ప్రభుత్వ ప్రకటన దీనికి భిన్నంగా ఉంది. తాము చాలా వరకు బందీలను విడిపించామని.. ఆపరేషన్ కొనసాగుతుందని.. రెబల్స్కు తీవ్ర స్థాయిలో నష్టం చేసినట్టు ప్రకటించింది. ఈ ప్రకటనను BLA ఖండించింది. బందీలంతా తమ వద్దే ఉన్నారని.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా పాక్ ప్రభుత్వం గుర్తించలేనంత కళ్లు మూసుకుపోయి ఉందని తెలిపింది.
రైలు హైజాక్ అయినప్పటి నుంచి తమ ఆపరేషన్ కొనసాగుతోందని పాక్ ఆర్మీ ప్రకటించింది. 30 గంటల పాటు కొనసాగిన పరస్పర దాడుల్లో 33 మంది మిలిటెంట్లను మట్టుపెట్టామన్నారు. తమ వైపు నుంచి 23 మంది సైనికులతో పాటు.. ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణీకులు మరణించినట్టు తెలిపింది. దీంతో ఈ ఆపరేషన్ ముగిసినట్టు తెలిపింది. ఈ స్టేట్మెంట్ను ఖండించి బలూచ్ నాయకులు తమ వారు కేవలం 12 మంది మాత్రమే మరణించినట్టు వెల్లడించారు.
ప్రస్తుతం పాక్ ప్రభుత్వం, BLA రెండు విభిన్నమైన స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తున్నాయి. అయితే వాస్తవాలు భిన్నంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బలూచ్ తిరుగుబాటుదారులను అప్రతిష్టపాలు చేసేందుకు పాకిస్తాన్ సైన్యం విచక్షణారహితంగా జరిపిన దాడితో బందీల్లో అమాయకులు చనిపోయారని స్థానికులు చెపుతున్నారు. పాక్ కాల్పుల్లో బలూచ్ తిరుగుబాటుదారులు కొందరు చనిపోగా అత్యధికంగా బందీలే చనిపోయారని, అందులో సైనికులు, ఐఎస్ఐ అధికారులు కూడా ఉన్నారని సమాచారం.