ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా ఎర్రుపాలెం మండలం నరసింహపురం గ్రామానికి వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు గ్రామంలో ఘనస్వాగతం లభించింది. గ్రామస్తులు, కాంగ్రెస్పార్టీ నాయకులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మంగళ హారతులు, బ్యాండ్ మేళాలతో భట్టి విక్రమార్కకు స్వాగతం పలికారు. ఎర్రుపాలెం మండల అధ్యక్షులు సుధాకర్రెడ్డి, కాంగ్రెస్ నరసింహపురం గ్రామశాఖ అధ్యక్షులు వేమిరెడ్డి రంగారెడ్డితో పాటు… పలువురు ఉపముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో దారివెంట విజనరీ లీడర్ భట్టి విక్రమార్కపై బంతిపూల వర్షం కురిపిస్తూ గ్రామస్తులు, పార్టీ నాయకులు తమ అభిమానం చాటుకున్నారు. ర్యాలీ మార్గమధ్యంలో దారివెంట వెళ్తున్న పలువురిని ఉప ముఖ్యమంత్రి నిలువరించి పలకరించారు. గ్రామంలో అభివృద్ధి, ప్రభుత్వం పనితీరు, సంక్షేమ పథకాల వినియోగం వంటి అంశాలను అడిగి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నరసింహపురం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపనలు చేశారు. నరసింహ పురం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడినుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుచ్చిరెడ్డిపాలెం బయలుదేరి వెళ్లారు.