విజయశాంతిని ఏ ఫార్ములాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు? దీని వెనక కాంగ్రెస్ పాటించిన విధానాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి.
విజయశాంతిని శాసనమండలికి పంపించడానికి ప్రధాన కారణం.. కవితకు దీటైన నాయకురాలు మండలిలో ఉండాలనే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అందువల్లే కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని మండలికి పంపించిందని విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక ఇదే సమయంలో విజయశాంతి కూడా కవితకు పోటీ ఇస్తానని స్వయంగా ప్రకటించడం, తానేంటో చూపిస్తానని కూడా విజయశాంతి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అవుతోంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై విడుదలైన అనంతరం కవిత శాసనమండలిలో బీసీ వాదం వినిపిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క మహిళ నాయకురాలు కూడా కవితకు దీటుగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విజయశాంతిని ఎమ్మెల్సీగా నియమించిందని తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై విజయశాంతి కూడా క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి ఒక లక్ష్యంతోనే తనను ఎమ్మెల్సీ చేశారని వ్యాఖ్యానించారు. అంతేకాదు..విజయశాంతి త్వరలో మంత్రి కూడా కాబోతున్నారని తెలుస్తోంది. అయితే, విజయశాంతికి మంత్రిత్వ శాఖ ఇస్తే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వారు ఊరుకుంటారా? అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేయరా? అనే ప్రశ్నలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.