కామారెడ్డి జిల్లాలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సంతోష్.. తన తమ్ముడి భార్యపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో బయటకు వెళ్లి వచ్చిన తమ్ముడి కారు అద్దాలు కూడా పగుల గొట్టాడు. దాదాపు గంట పాటు వీధుల్లో వీరంగం సృష్టించాడు.
కానిస్టేబుల్ సంతోష్.. మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవ పడుతూ, ఇంట్లో సామాను అంతా పగుల గొడుతుండగా.. ఆ ఘర్షణను చూసిన సంతోష్ తమ్ముడి భార్య సెల్ఫోన్లో వీడియో రికార్డ్ చేసింది. అయితే తన మరదలు వీడియో రికార్డ్ చేయడం గమనించిన సంతోష్ ఆమెపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. ఆమె చేతిలో ఉన్న సెల్ఫోన్ తీసుకొని వీడియో రికార్డ్ చేస్తావా? అంటూ నేలకేసి కొట్టాడు.
ఏఆర్ కానిస్టేబుల్ సంతోష్, అతని సోదరుడు వేణు పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు. తరచూ తల్లిదండ్రులు, సోదరుడితో గొడవ పడుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఇదే క్రమంలో బుధవారం కూడా సంతోష్ తాగి వచ్చి గలాటా సృష్టించాడని అంటున్నారు. అయితే, తన భార్యపై దాడి చేస్తున్న సమయంలో వేణు తన స్నేహితులతో కలిసి అప్పుడే ఇంటికి వచ్చాడు. సోదరుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వేణు స్నేహితులు కూడా సంతోష్కు నచ్చజెప్పారు. అయినా వినకుండా కారు అద్దాలు కూడా పగుల గొట్టాడు. ఆ తర్వాత కూడా కాసేపు వీధుల్లో తిరుగుతూ హంగామా సృష్టించాడని చెబుతున్నారు.
మరోవైపు.. అన్నాదమ్ములిద్దరూ ఘర్షణ పడ్డారని, ఆ పెనుగులాటలో సంతోష్ కింద పడిపోవడంతో తలకు దెబ్బ తగిలినట్లు చెబుతున్నారు. ఇక, జరిగిన సంఘటనపై సంతోష్, వేణు భార్య నవ్య పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో, గాయపడ్డ నవ్యను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ సంతోష్పై కేసు నమోదు చేసినట్లు భిక్కనూరు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.