సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… మీడియాతో మాట్లాడారు. తన గురించి ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ ఇష్టారాజ్యంగా మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజల తీర్పే.. కాంగ్రెస్ పార్టీకి, పాలనకు చెంపపెట్టులాంటిదన్నారు. నాపై ఆరోపణలకు ప్రజలే సరైన జవాబు ఇచ్చారు.
రైతులకు ఎకరాకు రూ.15 వేలు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500, దళితులకు రూ.12 లక్షలు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాను. జీవో 317 కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బిజెపి మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన రీతిలో గుణపాఠం చెప్పారని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు.