భారతీయ జనతా పార్టీ ఎంపి తేజస్వి సూర్య ఓ ఇంటివాడయ్యాడు. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్ను మనువాడారు. వీరి వివాహం బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, పలువురు నేతలు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
శివశ్రీ.. శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కాలేజీలో సంస్కృతంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ -2లో కన్నడ వర్షన్లో శివశ్రీ ఓ పాట ఆలపించారు. ఆమె యూట్యూబ్ చానెల్కు 2 లక్షల మందికిపైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు.
తేజస్వి సూర్య వృత్తి రీత్యా న్యాయవాది. ప్రస్తుతం ఆయన దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తరపున వరుసగా రెండోసారి ఎంపీగా గెలుపొందారు. 2024 ఎంపీ ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 3.31 లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. తేజస్వి చేతిలో కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ ఓడిపోయారు. 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.