తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగింది? రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? బీజేపీకి అంతర్గతంగా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినట్టేనా? ఈ ఎన్నికల్లో బోర్లా పడిందెవరు? బీఆర్ఎస్ కోట క్రమంగా బద్దలువుతున్నట్లేనా? అవుననే సంకేతాలు ఆ పార్టీ నేతల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త సంకేతాలిచ్చాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు అన్ని పార్టీలకు స్పష్టమైన సిగ్నల్స్ పంపించారు. రాష్ట్రంలో మూడు స్థానాలకు ఎన్నికలు జరిగితే రెండింటిని బీజేపీ గెలుచుకుంది. ఇవి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్స్ లాంటి ఫలితాలన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మరోవైపు.. బీజేపీకి జోష్ ఇచ్చే రిజల్ట్స్ అన్న చర్చ జరుగుతోంది. ఇక, బీఆర్ఎస్ రోజు రోజుకూ ప్రాభవం తగ్గిపోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానం బీజేపీ వశమయ్యింది. అలాగే, అవే నాలుగు జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కూడా కమలం పార్టీ ఎగరేసుకుపోయింది. పట్టభద్రుల స్థానం చూస్తే అది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ, కరీంనగర్లో ఆ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది.
ఇక, ఈ ఫలితాలు భారతీయ జనతా పార్టీలో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. రాష్ట్రస్థాయి నాయకత్వం నుంచి మొదలుకుంటే.. క్షేత్రస్థాయి కార్యకర్తల దాకా కాషాయం పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఈ గెలుపు సమిష్టి విజయమని అభివర్ణించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతున్నదనడానికి ఇది సంకేతమన్నారు. అయితే, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పార్టీ అవసరం కాదని, ఇక్కడి ప్రజల కోసం బీజేపీ అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. అటు.. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తనదైన శైలిలో ఈ విజయంపై స్పందించారు. ఈ గెలుపు ప్రధాని మోదీకి, తెలంగాణ ప్రజలకు అంకితమన్నారు. దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపై నమ్మకంతో ఉన్నారని అభిప్రాయ పడ్డారు. బడ్జెట్లో ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు వల్లే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లంతా ఈ తీర్పు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే, ఉపాధ్యాయ ఎన్నికల ఫలితాల్లో పన్ను స్లాబ్ అంశం ప్రభావ చూపించిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
ఇక, గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి చూస్తే.. బీఆర్ఎస్ కోటకు బీటలు పడుతున్నాయని అంటున్నారు. అయితే, ఈ ఫలితాలను ముందుగానే ఊహించి బీఆర్ఎస్ పార్టీ పోటీకి దూరంగా ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ మరింతగా ప్రజాదరణ కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. జరుగుతున్న పరిణామాలు, ఫలితాలు చూస్తేంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ క్రమంగా పాగా వేస్తుందన్న వాదనలు బలపడుతున్నాయి. తెలంగాణలో బీజేపీ అనుకున్నది సాధిస్తోందంటున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ సత్తా చాటుతోంది. ఇప్పుడు ఎన్నికలు జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని గెలుచుకుని దూకుడుగా ముందుకు సాగుతోంది. ఒకరకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ని మించి రిజల్ట్స్ రాబట్టింది కమలం పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బీజేపీ పట్టు మరింతగా పెరిగింది. ఈ ఎన్నికలు జరిగిన 6 లోక్సభ స్థానాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 13 జిల్లాలు, 217 మండలాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తరువాత బీజేపీలో జోష్ మరింతగా పెరిగింది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించాలని టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ.. ఆ దిశగా ఇప్పటినుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. క్షేత్రస్థాయిలో బలపడటం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకోవాలని భావిస్తోంది.