వాట్సప్ వీడియో కాల్ ద్వారా చేసిన వైద్యం వికటించి కవల గర్భస్ధ శిశువులు మృతి చెందిన విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి చెందిన బట్టి గణేష్, కీర్తి దంపతులకు ఏడేళ్ల కిందట వివాహం జరిగినా.. సంతానం కలగక పోవడంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ అనూషారెడ్డి దగ్గర వైద్యం చేయించుకున్నారు. ఈ క్రమంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న కీర్తికి నొప్పులు రావడంతో అదే ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఆమె కుటుంబ సభ్యులు తీసుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో వైద్యురాలు అనుషారెడ్డి ఆసుపత్రిలో లేకపోవడంతో నర్సుకు వాట్సప్ వీడియో కాల్ ద్వారా సూచనలు ఇచ్చి వైద్యం చేసే ప్రయత్నం చేసింది. అనుషారెడ్డి సూచనలతో నర్సు చేసిన వైద్యం వికటించి కీర్తి గర్భంలోనే కలవల శిశువులు మృతి చెందారు. ఇంత జరిగిన వైద్య చికిత్సకు 30 వేల రూపాయలు చెల్లించాలని బాధితులను ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. మీ నిర్లక్ష్యం వల్లే శిశువులు మృతి చెందారని కీర్తి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దాదాపు 15 లక్షల వరకూ ఖర్చు చేశామని, కవల పిల్లలు పుడుతున్నారని సంతోషంగా ఉన్న సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మా కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని కీర్తి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరుకు వైద్యశాలకు వచ్చి వివరాలు తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు ఆసుపత్రిని సీజ్ చేశారు.