రాబోయే రోజుల్లో ప్రజలెవ్వరూ కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా, ప్రభుత్వ సేవలన్నీ కూడా వాట్సాప్లోనే అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ దిశగా అన్ని శాఖలు తమ బ్యాక్ ఎండ్ మెకానిజం సమర్థవంతంగా ఉండేలా చూసుకోవాలన్నారు. మంత్రులు, కార్యదర్శుల సదస్సులో వాట్సాప్ గవర్నెన్స్పై ఇచ్చిన ప్రజెంటేషన్పైన సీఎం మాట్లాడుతూ అధికారులకు పలు మార్గదర్శకాలు చేశారు. వాట్సాప్ గవర్నెన్స్లో ప్రస్తుతం ఇస్తున్న సేవల సంఖ్య పెంచాలన్నారు. ప్రస్తుతం 161 సేవలిస్తున్నామని, రాబోయే 45 రోజుల్లో 500 సేవలు కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని, అలాగే రాబోయే మూడు లేదా ఆరు నెలల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలు కూడా వాట్సాప్లోనే ప్రజలు పొందేలా యంత్రాంగం సన్నదం కావాలన్నారు. దీన్ని ఏ స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లాలంటే ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక బిల్లు రాలేదంటే ప్రజలు దాన్ని స్కాన్ చేసి లేదా దాని వివరాలను వాట్సాప్లో పొందుపరిస్తే దాన్ని పరిశీలించి మనం క్లియర్ చేసేంత స్థాయికి తీసుకెళ్లాలన్నారు. ప్రజలు తమకు ప్రభుత్వం నుంచి ఏ పని కావాలన్నా కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరిగే పద్దతికి స్వప్తి పలికి, అసలు వాళ్లు ఏ కార్యాలయానికి రావాల్సిన అవసరమే లేకుండా కేవలం వాళ్ల చేతిలోని సెల్ఫోన్ ద్వారానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కావాల్సిన సేవలు పొందేలా చేయడమే తమ ఆశయమన్నారు. దీనికి అనుగుణంగా యంత్రాంగం సన్నద్ధమవ్వాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రయాణికులు ఆర్టీసీ బస్సు జీపీఎస్ ట్రాకింగ్ కూడా తమ వాట్సాప్లోనే చూసుకునే సదుపాయం కల్పించాలన్నారు.
వాట్సాప్ గవర్నెన్స్లోకి టీటీడీ
వాట్సాప్ గవర్నెన్స్లోకి టీటీడీ సేవలను కూడా తీసుకువస్తామని చెప్పారు. ఇవే కాకుండా అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి రైల్వే టికెట్లు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులు పొందే సదుపాయం కల్పిస్తామన్నారు. సినిమా టికెట్లు కూడా వాట్సాప్ ద్వారా పొందే సదుపాయం కల్పించే అంశం కూడా పరిశీలించాలన్నారు. కేవలం ఇవే కాకుండా ప్రభుత్వం పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే సేకరించాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ను మనం విస్తృతంగా అమలు చేస్తున్న ఈ తరుణంలో కొంతమంది కావాలని విమర్శలు చేసేవారుంటారని, ఎక్కడా ఎలాంటి లోపాలకు తావివ్వకుండా ప్రతి శాఖ కూడా సైబర్ సెక్యూరిటీ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ఐటీ శాఖ దీనిపైన ప్రత్యేకంగా పనిచేయాలన్నారు. వాట్సాప్లో క్యూ ఆర్ కోడ్, లేదా పౌరుల ఆధార్ అథంటికేషన్ కోరే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.
వాట్సాప్కు అనూహ్య స్పందన
వాట్సాప్ గవర్నెన్స్కు ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి కేవలం వారం రోజుల్లోపే 2,64,555 లావాదేవీలు జరిగాయి. ఇందులో 41 శాతం (1,10,761) ఆర్థిక లావాదేవీలు, 43.1 శాతం (1,14,119) సమాచారం కొరకు ఉపయోగించారు. ఈ వారం రోజుల్లోనే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ విభాగాలు, ఆయా సంస్థలు రూ.54.73 లక్షలు వసూలు అయ్యాయి. అత్యధికంగా విద్యాశాఖలో 82,938 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. వాట్సాప్లో 85 శాతం ట్రాన్సాక్షన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. 35 శాతం సర్వర్ స్పీడు సమస్య కారణంగా విఫలమయ్యాయని ఆయా శాఖలు తమ సర్వర్ స్పీడు పెంచుకోవాలని ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ కోరారు.