స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. రోజూ వినేదే అనుకుంటున్నారా? కానీ ఈసారి కుదేలయ్యింది అమెరికన్ స్టాక్ మార్కెట్లు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏకంగా 1.7 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ఇక సోమవారం ఒక్కరోజులోనే ఏకంగా 750 బిలియన్ డాలర్ల మేర నష్టపోయాయి ఏడు ప్రముఖ టెక్ కంపెనీలు. యాపిల్, గుగూల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, టెస్లా, గూగుల్ ఇలా అమెరికన్ టాప్ టెక్ కంపెనీలన్నింటికి సోమవారం రోజు రక్త కన్నీరే అని చెప్పాలి. ఈ ఏడు కంపెనీలు ఒకే రోజు 750 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశాయి. ఇందులో ఒక్క యాపిల్ కంపెనీ నష్టపోయిన సంపదే 174 బిలియన్ డాలర్లు.
మార్కెట్ ఒడిదొడుకుల దెబ్బకు ఈ కంపెనీల స్టాక్స్ కుప్పకూలాయి. యాపిల్ తర్వాత భారీగా నష్టపోయింది నాస్డాక్. ఏఐ చిప్ మేకర్ ఎన్విడియా కూడా భారీగా నష్టపోయింది. ఎన్విడియా 140 బిలియన్ డాలర్లు కోల్పోయింది. మైక్రోసాఫ్ట్ 98 బిలియన్ డాలర్లు, గూగుల్ 95 బిలియన్ డాలర్లు, అమెజాన్ 50 బిలియన్ డాలర్లు, మెటా 70 బిలియన్ డాలర్లు టెస్లా 130 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఈ కంపెనీ షేర్లు 15 శాతం నష్టపోయాయి. అల్ఫాబెట్, మెటా 4 శాతం.. మైక్రోసాఫ్ట్, ఆమెజాన్ 2 శాతం మేర నష్టాలను చవిచూశాయి.
ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే అమెరికన్ స్టాక్ మార్కెట్స్లో ఏకంగా 1.7 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. దీనంతటికి కారణం అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు. వివిధ దేశాలపై ఆయన విధిస్తున్న టారీఫ్లు ఆ దేశాలపై ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయో.. అమెరికాపై కూడా అంతే ఎఫెక్ట్ చూపిస్తున్నాయి.