దేశాన్ని క్లిష్టకాలంలో సంస్కరణలతో గట్టెక్కించిన అరుదైన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మరణం పట్ల రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో సంస్కరణలకు శ్రీకారం పడిందన్నారు. ఆయన మరణంతో దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు.
న్యూఢిల్లీలో డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి రేవంత్రెడ్డి నివాళులర్పించారు. ఒక ఆర్థిక వేత్తగా, అధ్యాపకుడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పూడ్చలేనిదని అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.