భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్ధాదాని నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు వాజ్పేయి స్మారక సదైవ్ అటల్ను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్పేయి స్మారకార్థం ఏర్పాటు చేసిన ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వాజ్పేయి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ వాజ్పేయి సేవలను స్మరిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ 100వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. బలమైన, స్వావలంబన, సంపన్నమైన దేశాన్ని నిర్మించడానికి వాజ్ పేయీ తన జీవితాన్ని అంకితం చేశారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఆయన దార్శనికత, లక్ష్యం కొనసాగుతుంది. గౌరవనీయులైన అటల్ బిహారీ వాజ్పేయీ రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ దేశానికి కొత్త దిశను, వేగాన్ని అందించారు. ఆయన సహవాసం, ఆశీస్సులు నాకు లభించడం నా అదృష్టం’ అని ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
అలాగే, మాజీ ప్రధాని వాజ్పేయీ దూరదృష్టి వల్లే భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ‘భారతజాతి గర్వించదగిన నేత వాజ్పేయి. ఆయన దూరదృష్టి వల్లే ప్రస్తుతం మన దేశం ప్రపంచదేశాలతో పోటీ పడుతోంది. దేశం గురించి వాజ్పేయి ఆలోచించే తీరు విలక్షణమైనది. సంస్కరణల ప్రతిపాదనలపై వాజ్పేయీ స్పందించిన తీరు ఎన్నటికీ మరచిపోలేను. ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాను’ అని ఎక్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు.
ఎన్డీయే నేతల సమావేశంలో చంద్రబాబు :
పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. మధ్యాహ్నం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు.