సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ కూలీలపై బండరాళ్లు కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు ఉపాధిహామీ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కన్నపేట మండలం గోవర్థనగిరి గ్రామంలో జరిగిందీ సంఘటన. గాయపడ్డ వాళ్లను హుటాహుటిన తోటి కూలీలు.. ఆసుపత్రికి తరలించారు.
గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు ఎప్పటిలాగే గురువారం ఉదయం ఉపాధి హామీ పనులు చేసేందుకు వెళ్లారు. వాళ్లు పనిచేస్తున్న ప్రాంతంలో ఎగువ ప్రాంతాన ఉన్న మట్టిదిబ్బ ఒక్కసారిగా కూలిపోయింది. మట్టిదిబ్బ దిగువ ప్రాంతంలో పనిచేస్తున్న కూలీలపై ఈ మట్టి పెళ్లలు పడిపోయాయి. దీంతో, ఈ మట్టి దిబ్బలకింద పడి ఊపిరాడక ఇద్దరు కూలీలు మృతిచెందారు. సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు, పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ ఐదుగురు కూలీలను ఆసుపత్రిలో చేర్పించారు.
అయితే, ఉపాధి హామీ కూలీ పనుల్లో అపశృతిఐ రాష్ట్రమంత్రి సీతక్క తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. విషయం తెలియగానే.. సిద్దిపేట జిల్లా డీఆర్డీవోను ఘటనాస్థలానికి పంపించారు. ప్రమాదంపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెప్పించుకున్నారు. ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అక్కడ పనులు చేయొద్దని జిల్లా అధికారులు వారం రోజులక్రితమే హెచ్చరించినా.. అక్కడ పనులు కొనసాగించడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాదు.. ఈ ప్రమాదంపై సంబంధిత శాఖ అధికారులతో సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వాళ్లకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మరణించిన, గాయపడిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీతక్క హమీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ అధికారులను ఆదేశించారు.