ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి, సీఐడీ మాజీ చీఫ్ సంజయ్కి ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. నిధులు దుర్వినియోగం చేశారంటూ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్పై అభియోలున్నాయి. దీంతో ఆయనను విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. సంజయ్కి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ఏసీబీ అధికారుల విచారణకు ఐపీఎస్ అధికారి సంజయ సహకరించాలని సూచించింది. అలాగే, సాక్షులను ప్రభావితం చేయొద్దని ఆదేశించింది. ఈ నిబంధనలు పాటించకపోతే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది.
గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్గా పనిచేసిన సంజయ్పై ప్రస్తుత కూటమి ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలకు దిగింది. గతంలో అగ్నిమాపక శాఖలో ఉన్నతాధికారిగా సంజయ్ పని చేశారు. ఆ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిధులను దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపింది. ట్యాబ్ల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని, అగ్ని మొబైల్ యాప్ను జేబు సంస్థగా వినియోగించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ సంజయ్ను వివరణ అడిగింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. దీంతో ఏసీబీ అధికారులు సంజయ్పై కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సంజయ్ కోర్టుకు వెళ్లడం, ఆయన అభ్యర్థనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవడంతో ఆయనకు కొంత రిలీఫ్ దొరికింది.