గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే బుధ, గురువారాల్లో గ్రేటర్ కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్ అన్నారు. గురువారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో జెండా ఎగరవేసేది కాంగ్రెస్ పార్టీనే అని మహేష్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మన రాష్ట్రం నుంచి కేంద్రంలో ఇద్దరు చేతకాని మంత్రులు ఉన్నారని వారు కేంద్రం నుంచి నిధులు తేలేరు కానీ ఆ పార్టీ కార్పొరేటర్లు మాత్రం భిక్షాటన చేస్తూ కౌన్సిల్ సమావేశాలకు వస్తారని ఎద్దేశా చేశారు. రిజర్వేషన్ల పెంపు అంశం మంత్రిమండలిలో చర్చించాక స్థానిక సంస్ధల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని మహేష్గౌడ్ తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి, ఫోర్త్ సిటీ, మా ప్రభుత్వ విజన్ల కారణంగానే రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో పడిపోయిన రియల్ఎస్టేట్ని మా ప్రభుత్వం ఇప్పుడు గాడిలో పెడుతోందన్నారు. బీఆర్ఎస్లాగ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి చేతులెత్తేసే రకం మేము కాదని, అధికార యంత్రాంగానికి క్లారిటీ లేకనే కొన్ని స్కీమ్లు ఆలస్యం అవుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్ చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక స్థానిక నాయకులకే అప్పగించామని, వారు సూచించిన మూడు పేర్లను ఏఐసీసీకి పంపామని రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. రైతు భరోసా విషయంలో రైతులకు మాకు క్లారిటీ ఉంది ప్రతిపక్షాలకే లేదని ఆయన అన్నారు. సీయం సెక్రటేరియేట్తో పాటు సీసీసీలో కూడా శాఖాపరమైన సమీక్షలు చేస్తున్నారన్నారు. ఫిబ్రవరి రెండో వారంలో సూర్యాపేటలో రాహుల్గాంధీ సభ ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే లు, మంత్రులు తమ అధికారిక నివాసంలో గవర్నర్, సీఎం, రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకోవాలని సూచిస్తున్నానని చెప్పారు. వైఎస్ఆర్కి తెలంగాణలో ఉన్నంత మంది అభిమానులు ఎవరీ లేరని మహేష్గౌడ్ అన్నారు.