ఎట్టకేలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో బీసీల మనోభావాలకు తూట్లు పొడిచే విధంగా కులగణన నివేదికను తగులబెట్టినందుకు పార్టీ క్యాడర్ నుంచి మీ మీద అనేక ఫిర్యాదులు అందాయని, పార్టీ లైన్కు విరుద్దంగా ఎందుకు ప్రవర్తించారో ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ జీ.చిన్నారెడ్డి చింతపండు నవీన్కుమార్కు నోటీసులు జారీ చేశారు. ఏఐసీసీ, రాహుల్ గాంధీ తదిరులు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కుల గణనకు వ్యతిరేకంగా మీరు పత్రికా ముఖంగా పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడారు, 50 రోజుల్లో కులగణను పూర్తి చేసి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిన విషయంపై అందరూ అభినందించారు. తెలంగాణ శాసన మండలి సభ్యునిగా ఉంటూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ మార్గదర్శకాలు, నిబంధనలను ఉల్లంఘించారని నోటీసులో పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికవడం కోసం మీకు కాంగ్రెస్ పార్టీ బీబీ ఫారం ఇచ్చి సహకరించిన విషయాన్ని మీరు మర్చిపోయారని చింతపండు నవీన్కుమార్కి ఇచ్చిన నోటీసులో చిన్నారెడ్డి ప్రశ్నించారు.