ప్రజా సమస్యలపై మనం చిత్తశుద్దితో ప్రజల తరపున రాజీ లేని పోరాటాలు చెయ్యాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన తరువాతాయన వైసీపీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో వైఎస్.జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పట్ల క్షేత్ర స్ధాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందని వైఎస్.జగన్ అన్నారు. మనం యుద్ద రంగంలో ఉన్నామని విజయం కోసం అందరం కలసి అడుగులు వేయాలని చెప్పారు. మనం ప్రజలకు తోడుగా వారి మధ్యలో ఉంటే విజయం సాధించినట్లే అన్నారు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన పని లేదని, ప్రతి ఒక్కరికీ నేను అండగా ఉంటానని భరోసా ఇస్తున్నానని తెలిపారు. మన సమర్ధతను నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశమని, పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఇట్టే ఏడాది గచిపోతోందని, జమిలి ఎన్నికలు కనుక జరగితే ఎన్నికలు మరింత ముందుకు వస్తాయని చెప్పారు. అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదు. మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయంలో అధికార పక్ష వైఖరిని ప్రజలకు చూపించేందుకే ఈరోజు అసెంబ్లీకి వెళ్లామని తెలిపారు. మనకు ప్రతిపక్ష హోదా ఇస్తే అందుకు తగ్గట్లుగా అసెంబ్లీ చర్చల సందర్భంగా సమయం కేటాయించాలని, సభానాయకుడితో సమానాంగా సమయం ఇవ్వాల్సి వస్తుందని అందు వల్లే మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వైఎస్.జగన్ వివరించారు. అయితే మనకు శాసనమండలిలో మంచి మెజార్టీ ఉందని దాన్ని వినియోగించుకుని ప్రజా సమస్యలను సభ దృష్టికి తేవాలని వైఎస్.జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.
- Advertisement with us -