పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రభుత్వానికి ఓ వార్నింగ్ ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫికి వచ్చే విదేశీ టూరిస్టులను కిడ్నాప్ చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించినట్టు తెలిసింది. ఇస్లామిక్ స్టేట్ ఖోర్సాన్ ప్రావిన్స్(ISKP) అనే ఉగ్ర సంస్థ ఈ దారుణానికి పాల్పడేందుకు సిద్ధంగా ఉందని పాక్ ఇంటెలిజెన్స్ ఏజేన్సీలు గుర్తించాయి. ముఖ్యంగా చైనా, అరబ్ దేశాల నుంచి వచ్చే వారిపై ఈ ఉగ్ర సంస్థ స్పెషల్ ఫోకస్ చేసినట్టు గుర్తించారు.
ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సర్వేలెన్స్ లేని చోట పర్యాటకులను కిడ్నాప్ చేసి వారి సేఫ్ హౌజ్ లకు తరలించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి దాడుల విషయంలో పాక్ కు చాలా చెడ్డ పేరు ఉంది. గతేడాదిలో చైనా ఇంజినీర్ల బృందంపై జరిగిన ఉగ్రదాడి కావొచ్చు.. 2009లో శ్రీలంక క్రికెట్ టీమ్ పై జరిగిన కాల్పులు కావొచ్చు.. ఇలా అనేక అంశాల విషయంలో పాక్ కు చాలా చెడ్డ పేరు ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు కొట్లాడి సాధించుకున్న చాంపియన్స్ ట్రోఫీ విషయంలో కూడా ఇలాంటిది ఏదైనా జరిగితే.. ఇప్పుడు పాక్ పరువు గంగలో కలిసిపోయినట్టే.
క్రికెట్ ను ISKP చూసే విధానమే తేడాగా ఉందని చెప్పవచ్చు. ముస్లింలపై యుద్ధం చేసేందుకు క్రికెట్ ను ఆయుధంగా చేసుకుంటున్నారని గతంలోనే ఈ ఉగ్ర సంస్థ ప్రకటించింది. ఇది జీహాది విధానాలకు వ్యతిరేకంగా ఉందని.. ముస్లింలను విడదీసే ఈ క్రికెట్ ను నిషేధించాలని డిమాండ్ చేసింది. అంతేకాదు క్రికెట్ కు మద్దతు పలికిన తాలిబన్ల నిర్ణయాన్ని కూడా ఈ ఉగ్ర సంస్థ వ్యతిరేకించింది.
ఇప్పటికే ఘోర పరాభవంతో ట్రోఫీ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమైన పాకిస్థాన్ కు ఇప్పుడిలాంటి ఘటన ఏదైనా జరిగితే దానికంటే ఘోర అవమానం మరోకటి ఉండదనే చెప్పాలి.