ఇండియాలో ఇంగ్లండ్ టూర్ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు మోస్ట్ మెమోరబుల్ అనే చెప్పాలి. టీ20 సిరీస్ను 4-1 తేడాతో.. వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది రోహిత్ సేన. మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో పరుగుల వరద పారించింది టీమిండియా. ఆఖరి వన్డేలో 142 పరుగుల తేడాతో గెలుపొందింది టీమ్ ఇండియా. ఇక ఆఖరి వన్డేలో శుభ్మన్ గిల్ 112, శ్రేయస్ అయ్యర్ 78, కోహ్లీ 52 పరుగులతో రాణించడంతో 356 పరుగులు చేసింది. ఇక ఇంగ్లండ్ చేజింగ్లో పూర్తిగా తేలిపోయింది. మొదట్లో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు.. 6 ఓవర్లకే 60 పరుగులు చేశారు. డకెట్, సాల్ట్ దూకుడు చూస్తే మ్యాచ్ త్వరగానే ముగుస్తుందా? అనిపించింది. కానీ అర్షదీప్ సాల్ట్ను ఔట్ చేయడంతో మ్యాచ్ టర్న్ అయ్యింది. ఆ తర్వాత భారత బౌలర్ల దెబ్బకు వరుగా వికెట్లు సమర్పించుకుంటూ వచ్చారు. దీంతో 214 పరుగులకే ఆలౌటైంది ఇంగ్లీష్ టీమ్. దీంతో గెలుపు.. సిరీస్ రెండూ దక్కాయి టీమిండియాకు.
మెప్పించిన రోహిత్, కోహ్లీ..
వీరేందుకూ పనికి రారు.. ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే అంటూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై ఇప్పటికే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అయితే వీటన్నింటికి ఈ సిరీస్లో చెక్ పెట్టారు ఈ ప్లేయర్లు. రెండో వన్డేలో రోహిత్ సెంచరీతో చెలరేగగా.. మూడో వన్డేలో కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి తనలో ఇంకా ఆట మిగిలి ఉందని చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు వీరిద్దరూ బ్యాట్కు పనిచెప్పడం మంచి పరిణామమనే చెప్పాలి.
అదరగొట్టిన గిల్..
గిల్.. మరోసారి అదరగొట్టాడు. కోహ్లీ, అయ్యర్తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు కోహ్లీ. 14 ఫోర్లు, మూడు సిక్స్లతో ఏకంగా 112 పరుగులు చేశాడు గిల్. దీంతో ఇండియా భారీ స్కోర్వైపు అడుగులు వేసింది.
ఇక నో టెన్షన్..
ఈ సిరీస్ ప్రారంభానికి ముందు అనేక అనుమానాలు ఉండేవి. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ, రాహుల్ ఫామ్ పరిస్థితి ఏంటని? ఇక బుమ్రా లేకపోతే బౌలింగ్ పరిస్థితి అంతేనా? ఇలా చాలా ప్రశ్నలు వేధించాయి. కానీ బ్యాట్స్మెన్ ఫామ్ను అందుకున్నారు. మరోవైపు అనూహ్యంగా హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు తమ సత్తా చాటారు. ఇక షమీ పర్వాలేదు అనిపించినా.. అర్షదీప్ తాను కూడా మ్యాజిక్ చేయగలనని ప్రూవ్ చేశాడు. ఇక స్పిన్నర్లందరూ ఆకట్టుకోవడం.. భారత్కు చాలా అనుకూలించే అవకాశమనే చెప్పాలి. ఎందుకంటే దుబాయ్ పిచ్లన్ని స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని తెలిసిందే.