బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో టీమిండియా ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే బౌలర్లు తడబడటంతో 474 పరుగుల భారీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియాకు తమ బ్యాట్తో సమాధానం చెబుతారనుకుంటే బ్యాటింగ్లోనూ తడబడింది. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు చేజార్చుకొని కేవలం 164 పరుగులు మాత్రమే చేసింది రోహిత్ సేన.
అంతకుముందు 311/6 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ అనుకున్నట్టుగా వికెట్లు కోల్పోలేదు. స్మిత్ సెంచరీతో అదరగొట్టాడు. రెండో రోజు మరో 163 పరుగులు చేసి కానీ ఆలౌట్ కాలేదు ఆస్ట్రేలియా. స్టీవ్ స్మిత్ 140, సామ్ కాన్స్టాస్ 60, ఉస్మాన్ ఖావాజా 57, లబుషేన్ 72 పరుగులతో రాణించారు. ఈసారి కూడా బుమ్రా నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు. రవీంద్ర జడేజా 3, ఆకాశ్ దీప్ 2, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు.
ఇక బ్యాటింగ్లో ఆరంభంలోనే షాక్ తగిలిందని చెప్పాలి. ఓపెనర్గా వచ్చిన రోహిత్ కేవలం 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. యశస్వి జైశ్వాల్ మాత్రం 82 పరుగులతో రాణించాడు. అనవసరమైన రన్కు ప్రయత్నించి రన్ ఔట్ అయ్యాడు జైశ్వాల్. ఇక కోహ్లీ 36, రాహుల్ 24 పరుగులు మాత్రమే చేశారు. ఒకానొక సమయంలో జైశ్వాల్, కోహ్లీ పాట్ననర్ షిప్ మెరుగవుతుంది అనుకునే సమయంలోనే జైశ్వాల్ వికెట్ కోల్పోయారు. వీరిద్దరు కలిసి 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నైట్వాచ్మెన్గా వచ్చిన ఆకాశ్ దీప్ డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ 159 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 164/5. ప్రస్తుతం క్రీజులో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు. ఆసీస్ కంటే భారత్ ఇంకా 310 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం పంత్, జడేజాపైనే భారం ఉంది. వీరు కూడా వికెట్లను చేజార్చుకుంటే ఇండియా ఫాలో ఆన్ ఆడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.