కెనడా మరోసారి భారత్ను టార్గెట్గా చేసుకుంది. త్వరలో కెనడాలో జరిగే ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం ఉందంటూ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రకటన చేసింది. ఆ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ వానెస్సా లాయిడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మా శత్రు దేశా నేతలు AI సాయంతో తమ ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని చూస్తున్నారంటూ తమకు సమాచార ఉందని.. చైనా ప్రభుత్వం ఎక్కువగా ఈ ప్రయత్నాలు చేస్తుండగా.. భారత్ కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉందంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో మరో వివాదాన్ని నిద్రలేపారు కెనడా పెద్దలు.
నిజానికి కెనడా ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఎప్పుడైతే ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడో.. అప్పటి నుంచి భారత్పై అక్కసు పెంచుకుంది కెనడా. ఓ ఉగ్రవాదిని వెనకేసుకొస్తూ భారత్పై అనేక ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే కెనడాకు ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వస్తోంది భారత్. ఇప్పుడు చైనా కూడా ఈ లిస్ట్లో చేరడంతో.. కెనడా ఆరోపణలను కొట్టిపారేసింది.
గతంలో కూడా కెనడా ఎన్నికల్లో భారత్, చైనాలు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించాయని.. కానీ ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదంటూ ఓ అధికారిక రిపోర్టును రిలీజ్ చేసింది ఆ దేశం. అయితే ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీ నేతలను భారత్ ఏజెంట్ల ద్వారా రహస్యంగా ఆర్థిక సాయం అందించినట్టు తమకు సమాచారం ఉందని ఆరోపించింది. ఇలా సమాచారం ఉంది.. కావొచ్చు.. అవ్వొచ్చు.. అంటూ మన దేశంలో సోషల్ మీడియా పోస్టులు పెట్టినట్టు ఓ దేశం అధికారిక రిపోర్టులు రిలీజ్ చేయడం చూస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని పరిస్థితి భారతదేశ విదేశాంగశాఖది. ఇప్పటి వరకు అనేక ఆరోపణలు చేసిన కెనడా.. ఇంత వరకు ఒక్క ఆధారాన్ని కూడా ప్రపంచానికి చూపించలేకపోయింది.
ఏప్రిల్ 28న ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు ఆ దేశ నూతన ప్రధాని మార్క్ కార్నీ. ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారీఫ్లనే ఆయన ఎన్నికల అస్త్రంగా మలుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.