కేంద్ర హోంశాఖ. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధికారికంగా విభజిస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వంలోని కీలక విభాగం. రాష్ట్ర విభజనకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక వ్యవహారాలన్నింటినీ లెక్కలు గట్టింది.. రెండు రాస్ట్రాలకూ వాటాలు పంచింది కూడా కేంద్ర హోంశాఖనే. కానీ, పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. సాక్షాత్తూ ఆ విభాగమే విడుదల చేసిన ఓ అత్యున్నత స్థాయి ఉత్తర్వులు అందరినీ విస్తుపోయేలా చేశాయి. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇదేం విడ్డూరమంటూ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.
అసలు విషయం ఏంటంటే.. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో గత నెల 22వ తేదీన జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలన్నింటినీ అప్రమత్తం చేస్తోంది. పాకిస్తాన్తో సమరమే! అని స్పష్టంగా ప్రకటనలు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దుల్లో నిత్యం పాకిస్తాన్ కవ్వింపులకు పాల్పడుతోంది. అయితే, ఇది దేశ అధికార యంత్రాంగాన్ని, దేశ ప్రజలను పాకిస్తాన్ దృష్టి మరల్చే కార్యక్రమమే అని కేంద్రం అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలను అప్రమత్తం చేసేలా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్వర్వులు జారీచేసింది. ఈనెల 7వ తేదీ బుధవారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ మాక్డ్రిల్ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ ఉత్తర్వుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రస్తావన లేదు. హైదరాబాద్ను ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా చూపించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో హైదరాబాద్, విశాఖ పట్నంలో ఈ మాక్ డ్రిల్ ఉంటుందని కేంద్ర హోంశాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
అయితే, కేంద్ర హోంశాఖ మాక్ డ్రిల్పై విడుదల చేసిన ఉత్తర్వులు పాతవి పొరపాటున సర్కులేట్ అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2005లో జరిగిన మాక్ డ్రిల్కు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పుడు వెలువడిన ఉత్తర్వులుగా పొరపాటున విడుదలైనట్లు అంటున్నారు.