ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో ఈరోజు సీబీఐ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. దాదాపు 14 సంవత్సరాల తరువాత ఈ రోజు ఓబుళాపురం కేసులో సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది.ఈ కేసులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్థనరెడ్డితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అభియోగాలు నమోదై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఓబుళాపురం ఇనుప గనుల మైనింగ్లో నిబంధనలకు విరుద్దంగా ఓఎంసీ అక్రమ తవ్వకాలు చేసిందనే కారణంతో అక్కడ మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ అప్పటి ప్రభుత్వం జోఓ నెం 71ని విడుదల చేసింది. అంతే కాకుండా అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై 2009 డిసెంబర్ 7వ తేదీన అప్పటి సీయం కొణిజేటి రోశయ్య సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో గాలి జనార్ధనరెడ్డితో పాటు అప్పటి మైనింగ్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఓఎంసీ మాజీ ఎండీ బీవీ.శ్రీనివాసురెడ్డి, మైనింగ్ శాఖ డైరెక్టర్ రాజగోపాల్, మాజీ ఐఎఎస్ అధికారి కృపానందం, గాలి జనార్ధనరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఎం.అలీఖాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి మొదటి ఛార్జిషీట్ ని 2011వ సంత్సరంలో కోర్టులో దాఖలు చేసింది సీబీఐ. 3400 పేజీలతో దాఖలు చేసిన ఈ ఛార్జిషీటులో 219 మంది సాక్షులను విచారించి దాదాపు రూ.884 కోట్ల ప్రజాధనం లూఠీ జరిగినట్లు సీబీఐ అభియోగాలు మోపింది.
- Advertisement with us -