ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ వర్ధిల్లుతోందంటే… అందుకు రాజ్యాంగం, దానిని రూపొందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మూల కారణమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఉల్లంఘించిన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేయాలని భట్టి డిమాండ్ చేశారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ పై హోం మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన నిరసన ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..రాజ్యాంగం అంటే ఏ కొద్ది మంది దళితులు బలహీనవర్గాలు పేదవారికి సంబంధించినది కాదని, ప్రతి ఒక్కరి కి సంబంధించినదన్నారు.
ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, మహిళలకు ఆస్తిలో హక్కు, ఈ దేశ వనరులు, సంపద సమానంగా పంచాలని రాజ్యాంగం చెప్పిందని గుర్తు చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా కోరడం మనందరి నైతిక హక్కన్నారు.
రాజ్యాంగాన్ని బలహీనపరచాలని బిజెపి భావిస్తుంది. ఈ అంశాన్ని గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించి వివరిస్తున్నారని.. ఆయన చెప్పిందే నిజం అన్నట్టు తాజాగా పార్లమెంటులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.