దేశంలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమం తెలంగాణలో జరగబోతోందని పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. త్వరలో లక్ష డప్పులు.. వేల గొంతులు ప్రోగ్రాంతో మాదిగలు సత్తా చాటబోతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ అడ్డుకుంటున్నది రెండు మాలల కుటుంబాలని.. వారిలో ఒకటి మల్లు కుటుంబం అయితే మరొకటి వెంకట స్వామి కుటుంబం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఆయన మీట్ దిప్రెస్లో మాట్లాడారు.
రేవంత్ రెడ్డికి రెండు నెలలు సమయం ఇచ్చామని, ఇక ఆగేది లేదని మందకృష్ణ స్పష్టం చేశారు. ఎస్సీల వర్గీకరణకు అనుకూలమని రేవంత్ రెడ్డి ప్రకటించినా.. ఒక్క అడుగు కూడా ముందుకు వేయడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తొండాట ఆడుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై రేవంత్ రెడ్డి మాట మారుస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ పార్టీలో లేనంతగా కాంగ్రెస్ పార్టీలో మాత్రమే మాలల ఆధిపత్యం ఉందన్నారు. లక్ష కోట్ల ఆస్తులతో వివేక్.. తమ ఉద్యమాన్ని అడ్డుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల సామాజిక వర్గ నాయకుడని, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మాలల సింహ గర్జన పేరుతో మీటింగ్ పెట్టుకున్నారని తెలిపారు. లక్ష బర్షలు లక్ష కట్టెలు అని మాలలు నినాదం తీసుకున్నారన్న మందకృష్ణ మాదిగ.. తమ ఆవేదన వినిపించడం కోసం లక్ష డప్పులు వేల గొంతులు ప్రోగ్రాం చేపడుతున్నామన్నారు. మాలలు అనే సింహాల మధ్యలో మాదిగలు అనే జింకలు వాళ్లతో కలిసి బతకలేమని మందకృష్ణ మాదిగ అన్నారు.