తెలంగాణలో రైతులకు భరోసా మొదలయ్యింది. రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు ఆర్థిక సాయం పంపిణీ ప్రారంభమయ్యింది. రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం లాంఛనంగా చేసింది ప్రభుత్వం. అన్ని మండల కేంద్రాల్లో లబ్దిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ మొదలుపెట్టింది. నిన్న ఆదివారం కావడంతో బ్యాంకుల నుంచి డబ్బులు జమ కాలేదు. అయితే, మరుసటిరోజు అంటే ఇవాళ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే కార్యక్రమం మొదలయ్యింది.
కాంగ్రెస్పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో రైతు భరోసా పథకం కూడా కీలకంగా నిలిచింది. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న రైతులందరి ఖాతాల్లో వాళ్లు సాగుచేస్తున్న భూమి విస్తీర్ణాన్ని బట్టి ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రకటనతోనే సరిపెట్టుకోకుండా మేనిఫెస్టోలో కూడా చేర్చింది. ఆ హామీ మేరకు రైతు భరోసా ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించింది. నిన్న అధికారికంగా పథకం ప్రారంభించారు. అయితే, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయిన భట్టి విక్రమార్క మల్లు ఆదేశాలతో ఆర్థిక శాఖ అధికారులు అన్నదాతల ఖాతాల్లోకి నగదు ట్రాన్స్ఫర్ ప్రారంభించారు. తమ ఖాతాల్లో నగదు జమ కాగానే.. వాళ్ల మొబైల్స్కు సందేశాలు వచ్చాయి. ఆ సందేశాలు చూసుకొని రైతులు మురిసిపోతున్నారు. అంతేకాదు.. గతంలో కంటే రైతు భరోసా సాయం పెరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.