సరళీ కృత ఆర్థిక విధానాల సృష్టికర్త….
భారత ఆర్ధిక గతిని మేలు మలుపు తిప్పిన సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ ప్రపంచ చరిత్రపుటల్లో కూడా ఎప్పటికీ నిలిచిపోతారు. మంచి రాజకీయ వేత్త, అపర చాణుక్యుడుగా పేరొందిన పీ.వి. నరసింహారావు ప్రియ శిష్యుడైన మన్మోహన్ పుట్టినది పాకిస్థాన్ లోని ఘా ఏరియాలో.. అయితే 1947 దేశ విభజన సమయంలో ఆయన భారత్ కు వచ్చేశారు. 1932 సెప్టంబర్ 26న గుర్మిత్సింగ్, అమ్రిత్ కౌర్ దంపతులకు జన్మించారు. పంజాబ్ లోని ఖత్రి వర్గానికి చెందిన వాణిజ్యవేత్తల కుటుంబంలో ఆయన పుట్టారు. తల్లి చాలా చిన్న వయసులోనే చనిపోవడంతో నాయనమ్మ దగ్గరే పెరిగారు. ఆమె అంటే ఆయనకు అపారమైన గౌరవం, ప్రేమ. మాతృ భాష పంజాబీ అయినా ఆయనకు ఉర్దూ భాషపై ప్రత్యేక మమకారం ఉంది. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు స్కూలింగ్ మొదట ఉర్దూ మీడియంలోనే మొదలైంది. అందుకే ఆయన ప్రధానిగా అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు తన హిందీ ప్రసంగాలను ఉర్దూ లిపిలోనే రాయించుకునేవారు. అమృతసర్ హిందూ కాలేజీలో చదువు పూర్తయ్యాక హోషియార్ పూర్లోని పంజాబ్ యూనివర్సటీలో పై చదువులు చదివారు. ఆర్ధిక శాస్త్రం ఆయన ఫేవరెట్ సబ్జెక్ట్. బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీలు కూడా అందులోనే. చదువు పరంగా ఆయన ట్రాక్ రికార్డుకూడా ఎప్పుడూ ఫస్టే. ఆతర్వాత కేంబ్రిడ్జిలో ఎకనామిక్స్ లో డాక్టరేట్ చేశారు. ఆయన థీసిస్ కూడా ప్రత్యేకమే. 1951,1960 మధ్య కాలంలో భారత్ ఎగుమతుల తీరు, ఉన్నఅవకాశాలు, పాలసీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైనా ఆయన పీహెచ్డీ చేశారు. ఆ అనుభవమే ఆ తర్వాత ఆయన కలం పట్టి భారత ఎగుమతి విధానాలు, అవకాశాలు, సుస్థిర పురోగతి అనే పుస్తకం రాయడానికి కారణమైంది.
సంస్కరణల రూపశిల్పి..
రెండుసార్లు ప్రధానిగా అత్యంత సంక్షోభ సమయాల్లో తన దీక్షా దక్షతలతో దేశాన్ని ఆయన ముందుకు నడిపారు. తొలి సిక్కు ప్రధాని అయిన మన్మోహన్ గాంధీ యేతర కుటుంబానికి చెందిన ప్రధానిగా రెండో వ్యక్తి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ ఆయనతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేలా చేసింది. ఆపై ఐక్యరాజ్య సమితిలో 1966నుంచి 1969 వరకూ పనిచేశారు. అప్పటి కేంద్ర మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా తన కామర్స్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో అడ్వైజర్ గా తీసుకోవడంతో ఆయన బ్యూరోక్రటిక్ కెరీర్ మొదలైంది. 1970 నుంచి 1980 వరకూ ఆయన ప్రభుత్వాలలో అత్యంత కీలక పదవుల్లో కొనసాగారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన ప్రధాన ఆర్థిక సలహాదారుగా కొనసాగారు. ఆతర్వాత రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా 1982 నుంచి 1985 వరకూ కొనసాగారు. ఇక దేశానికి చోదక శక్తి లాంటి ప్రణాళికా సంఘంలో మన్మోహన్ సేవలు నిరుపమానం.
పీవీ వేలు పట్టుకుని రాజకీయాల్లోకి..
అది దేశానికి అత్యంత గడ్డుకాలం. అత్యంత సంక్షోభ సమయంలో పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అప్పటికే మన్మోహన్ ట్రాక్ రికార్డుపైనా, సమర్ధతపైనా పూర్తి అవగాహన ఉన్న పీవీ ఆయన్ను ఆర్థిక మంత్రిగా తన కేబినెట్ లో తీసుకుని రాజకీయ రంగంలోకి అడుగేలేయించారు. ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి తొలిసారి దేశ ఆర్థిక పగ్గాలు చేపట్టారు. విదేశీ ద్రవ్యనిధులు అడుగంటి ఆర్ధికంగా కునారిల్లిపోయి ఉన్న భారత్ కి సరళీకృత ఆర్థిక విధానాలనే టానిక్ ఇచ్చారు. దీనికి విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థకు ఈవిధానం మంచిది కాదని, వ్యవస్థ కుప్పకూలుతుందని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. కానీ బయట మాత్రం ఆయన ఖ్యాతి ఇనుమడించింది. కుదేలైపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్న పేరు, ప్రశంసలు వచ్చాయి. సంస్కరణల రూపశిల్పిగా ఆయన్ను ప్రపంచం కీర్తించింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఇవేవీ కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించలేకపోయాయి. 1996 ఎన్నికల తర్వాత వాజపేయి హయాంలో ఆయన రాజ్యసభకు విపక్ష నేతగా వ్యవహరించాల్సి వచ్చింది.
సంకీర్ణ ప్రభుత్వ ప్రధానిగా
బీజేపి ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత మళ్లీ కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టింది. అయితే ఈసారి ఏకపక్షంగా కాదు.. యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ ప్రభుత్వాధినేతగా మన్మోహన్ ప్రధాని పగ్గాలు చేపట్టారు. ఇది కూడా ఆషామాషీగా రాలేదు. యూపీఏ ఛైర్ పర్సన్ గా పగ్గాలు చేపట్టిన సోనియా ప్రధాని పదవిని తీసుకునేందుకు విముఖత చూపారు. దీనికి కారణంఅప్పటికే ఆమె పై విదేశీ వనిత అనే ముద్ర ఉండటం, రాజకీయంగా అస్సలు అవగాహన లేకపోవడంతో సోనియా తెర వెనుక ఉండే చక్రం తిప్పారు. శరద్ పవార్ లాంటి స్టాల్ వార్ట్ లు ప్రధానిగా గద్దెనెక్కేందుకు తీవ్రంగా లాబీయింగ్ చేసుకున్నారు. ఏం చేయాలో ఎటు వెళ్లాలో తెలీని స్థితిలో అన్ని విధాలా అనుకూలుడైన మన్మోహన్ పేరు తెరపైకి వచ్చింది అప్పుడే.
ప్రత్యక్ష ఎన్నికలకు ఎప్పుడూ దూరమే…
మన్మోహన్ పంజాబ్ కు చెందిన వ్యక్తి అయినాగానీ అదేంటో ఆయన ఎన్నడూ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. అస్సాం నుంచి మొన్నటివరకూ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆయన రెండుసార్లు ప్రధానిగా కొనసాగినా… దురదృష్టం ఏంటో తెలీదు కానీ ఆయన ప్రభుత్వం పైనే ఎక్కువ అవినీతి ఆరోపణలు వచ్చాయి.