రాజకీయాల్లో ఉంటే ఎవరూ కామ్ గా ఉండరు.. అసలు ఉండలేరు.. అందులోనూ కుమ్ములాటలకు పేరెన్నికగన్నకాంగ్రెస్ లో.. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ మాత్రం అందుకు పూర్తి భిన్నం.. దేశ రాజకీయాల్లోనే అంత కీలక స్థానంలో ఉంటూ మౌనంగా ఉండటం ఆయనకి మాత్రమే సాధ్యమైంది. పదేళ్ల సంకీర్ణ ప్రభుత్వానికి ఆయన సారధ్యం వహించారంటే ఎంత ఓపిక ఉండాలి. పదవులపై ఆశలేదు. రాజకీయంపై పెద్దగా అవగాహనా లేదు.. అత్యాశలూ లేవు.. ఇచ్చిన పదవిని సవ్యంగా నిర్వర్తించడం వరకే ఆయన పరిమితమయ్యారు. బహుశా అందుకే గాంధీయేతర ప్రధానిగా నెట్టుకొచ్చారు. సోనియాకు కూడా అలాంటి వ్యక్తే కావాలి. అందుకే ఆయన రెండుసార్లు ప్రధాని కాగలిగారు. సహజంగానే చాలా సునిశిత అవగాహన, అణుకువ, నెమ్మది తనం కలిగిన ఆయన్ను విపక్షాలు, మీడియా మౌన ముని అని ముద్రవేశాయి. ప్రభుత్వాన్ని పట్టికుదిపేసిన స్కామ్ లయినా, రాజకీయ సంక్షోభమైనా, కాంగ్రెస్ లో కుమ్ములాటలైనా.. విషయం ఏదైనా ఆయన ఎనాడూ ప్రెస్ ముందు కానీ, ఇంటర్వ్యూలలో కానీ కామెంట్ చేయలేదు. వివాదాస్పద అంశాలు మీడియా ప్రస్తావించినా ఆయన సమాధానం ఎంతో బాలెన్స్ డ్ గా, సౌమ్యంగా ఉండేది. అందుకే ఆయన్ను అందరూ మౌన ముని అనేవారు.
అలా అనడం సరికాదు..
అయితే ఒకానొక సందర్భంలో మాత్రం ఆయన స్పందించారు. తనపై పడిన ఈ ముద్ర తప్పని అన్నారు. తన పదవీ కాలంలో తాను వ్యవహరించిన తీరుపై ఆయనో పుస్తకం వెలువరించారు. ఛేంజింగ్ ఇండియా అనే ఆరు వాల్యూంల పుస్తకాన్నిఆయన ముద్రించారు. దాని విడుదల సందర్భంగా మన్మోహన్ పెదవి విప్పారు. తనను మౌనముని అనడం సరికాదని, ప్రెస్ తో మాట్లాడటానికి భయపడతాననడంలో అర్ధం లేదని అన్నారు. ఈఆరోపణలకు జవాబే ఆ పుస్తకం అన్నారు. అందులో ఆయన దశాబ్దం పాటు భారత పగ్గాలు చేపట్టినప్పుడు తాను విదేశాల్లో ఎదుర్కొన్న ప్రెస్ కాన్ఫరెన్సులు, ప్రెస్ మీట్ లు, ఇంటర్వ్యూలు అన్నింటినీ పుస్తకంలో ముద్రించారు. తన పైఆరోపణలకు ఇదే సమాధానం అన్నారు.
సెన్సాఫ్ హ్యూమర్… ఎక్కువే..
అంతేకాదు.. మన్మోహన్ తీరుపై జాతీయ టెలివిజన్ ఛానెళ్లు పదునైన విమర్శలతో కూడిన కామెడీ ప్రోగ్రామ్స్ కూడా చేసేవి. అప్పట్లో వారం రోజులూ ఈ కార్యక్రమం ప్రసారమయ్యేది. అదీ ప్రైమ్ టైమ్ లో.. నిజానికి ఆ వాతవరణం ఇవాళ ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ కామెడీ యాంకర్లంతా కటకటాలులెక్కపెట్టాల్సిందే. తనపై ఘాటైన జోకులు, పంచ్ లు రోజూ ఛానెళ్లలో ప్రసారమవుతున్నా వారిపై మన్మోహన్ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కోపగించుకున్న సందర్భమే లేదు. మీడియా స్వేచ్ఛ అంతలా ఉండేది. యాక్టర్, కమేడియన్ వీర్ దాస్ ఇదే విషయం ఇన్ స్టా లో గుర్తు చేసుకున్నారు. ఆయన సమర్ధత, స్థాయి తెలియక 20 ఏళ్ల వయసులో తాము రూపొందించిన ఆకార్యక్రమాలను చూసి కూడా ఆయన ఏమీ అనేవారు కాదని, ఓసారి ఇదే విషయం మన్మోహన్ను అడిగితే చరిత్ర తనను సౌమ్యుడిగా గర్తుంచుకుంటుందని నవ్వుతూ కామెంట్ చేశారని, తనపై కామెడీని కూడా సహృదయంతో తీసుకునే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయనకుందని అన్నారు.