- ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- ఈనెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు
- 17న ఎస్సీ వర్గీకరణ, 18న బీసీ కుల గణన పై చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రసంగం గంట పాటు సాగింది. అంతకుముందు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనసభ వ్యహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు స్వాగతం పలికారు. ప్రతిపక్ష నేత కేసిఆర్ కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం టిఆర్ఎస్ తో పాటు బిజెపి సభ్యులు కూడా వివిధ అంశాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు.
గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే బీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలను ఈనెల 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 19న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 13, 15 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. హోలీ సందర్భంగా ఈనెల 14న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. అదేవిధంగా ఈనెల 17న ఎస్సీ వర్గీకరణ చట్ట బద్రతపై చర్చ జరపాలని బీఏసీలో నిర్ణయించారు. దీనితో పాటు ఈనెల 18న బీసీ కులగరణ రిజర్వేషన్లపై కూడా సభలో చర్చించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. ఈనెల 21న బడ్జెట్ పై చర్చ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలని బిఆర్ఎస్, బిజెపి పక్షాలు బీఏసీ సమావేశంలో పట్టుబట్టాయి. తమ ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వం ఈ సమావేశంలో స్పష్టం చేసింది.