పహెల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఇంకా కశ్మీర్లోనే ఉన్నారా? అంటే ఔననే అంటోంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఉగ్రవాదులు పాకిస్థాన్కు పారిపోలేదని.. కశ్మీర్లోనే నక్కి ఉన్నట్టు NIA అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం ఇప్పుడు వైరల్గా మారింది. వీరంతా దక్షిణ కశ్మీర్లోనే ఉన్నారనేది NIA అనుమానం. ప్రస్తుతం అల్ట్రా సెక్యూర్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ను వాడుతున్నారని.. అందుకే వారిని ట్రేస్ చేయడం కష్టంగా మారిందని అనుమానిస్తోంది NIA.
ఉగ్రదాడికి సంబంధించి NIA విచారణలో దిమ్మతిరిగే విషయాలను తెలుసుకున్నట్టు సమాచారం. ఉగ్రదాడిలో పాల్గొన్నది కేవలం నలుగురు ఉగ్రవాదులే అయినా.. దాడి సమయంలో ఆ ప్రాంతంలో అనేక మంది ఉగ్రవాదులు ఉన్నట్టు అనుమనిస్తోంది NIA. ఒకవేళ భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ వెంటనే చేపడితే దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అందుకే దాడుల సమయంలో వారంతా దూరంగా ఉండి అన్నింటిని ఓ కంట కనిపెడుతున్నట్టు అనుమానిస్తోంది.
ఇక ఉగ్రవాదులు అల్ట్రా సెక్యూర్డ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఉపయోగించినట్టు సమాచారం. వీటిని ఉపయోగించి షార్ట్ రేంజ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు పంపడానికి ఉపయోగించినట్టు తెలుస్తోంది. అందుకే దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్లు సంపాదించలేకపోయాయని సమాచారం. ఇదంతా కూడా నార్మల్గా జరగలేదని.. మిలటరీ గ్రేడ్ ఎక్విప్మెంట్ను ఉపయోగించారని NIA అనుమానిస్తోంది.
ఉగ్రవాదులు ఈ దాడులు చేయడానికి ముందు మూడు పర్యాటక ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో ఆ ప్రాంతాలను విరమించుకొని బైసరన్ వ్యాలీలో దాడులు చేసినట్టు గుర్తించింది NIA.