ఉన్నతాధికారులతో సమావేశమైన సభాపతులు
సోమవారం నుంచి తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో ఇరు సభల అధ్యక్షులు భేటీ అయ్యారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు సంయుక్తంగా అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ ఛాంబర్ లో నిర్వహించిన ఈ సమావేశంలో సభ సజావుగా సాగడానికి అందరూ సహకరించాలని ఇరువురు సభాపతులు కోరారు. సభలో గౌరవ సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సభకు, గౌరవ సభ్యులకు అందించాలని అధికారులకు సూచించారు. సభకు సమర్పించే సమాధాన పత్రాలను ముందుగానే పంపినట్లయితే వాటిని సభ్యులు చదువుకొని సభలో మాట్లాడడానికి, చర్చించడానికి అవకాశం ఉంటుందన్నారు. గత సమావేశాలకు సంబంధించి పెండింగులో ఉన్న ప్రశ్నలకు జవాబులను వెంటనే సంబంధిత సభ్యులకు పంపించాలని స్పీకర్లు అధికారులను ఆదేశించారు. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ బాషలలో ముద్రించి ముందస్తుగా సభ్యులకు అందచేస్తే వారు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుందన్నారు. సభలో చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలని సభాపతులు ఇరువురు ఉన్నతాదికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చ జరగడానికి అందరూ సహకించాలని అధికారులను కోరారు. ఈ సమావేశానికి శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.