తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహానాడు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నప్పటికీ, కడప జిల్లా నేతల మధ్య అంతర్గత కలహాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కమలాపురం నియోజకవర్గంలో మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.
కడప జిల్లాలో గతంంలో కన్నా మెరుగైన విజయం సాధించి, జగన్ కుటుంబానికి సవాల్ విసిరిన టీడీపీ, అదే ఊపుతో జిల్లాలో మహానాడును నిర్వహించాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నారు.
అయితే, మొదట్లో ఐక్యంగా ఉన్న జిల్లా నేతలు ఇప్పుడు విభేదాలతో విడిపోయినట్టుగా కనిపిస్తున్నారు. కమలాపురం ఎమ్మెల్యే సతీష్ రెడ్డికి మహానాడు బాధ్యతలు అప్పగించడంపై బీటెక్ రవి వర్గం సహా ఇతర నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీటెక్ రవి, కడప ఎమ్మెల్యే మాధవి లాంటి కీలక నాయకులు ఏర్పాట్లకు దూరంగా ఉంటుండటంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరు వచ్చినా, రాకున్నా మహానాడు ఆగదని వ్యాఖ్యానించడం వివాదాన్ని మరింత పెంచింది. ఈ వ్యవహారంపై పలువురు నేతలు పార్టీ హైకమాండ్కు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం.
మహానాడు వేదికగా జగన్ను రాజకీయంగా గట్టిగా ఎదుర్కోవాలన్న లక్ష్యంతో టీడీపీ నాయకత్వం ముందుకెళ్లాలనుకుంటోంది. కానీ, జిల్లా నేతల విభేదాలు, సమన్వయ లోపం మహానాడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న ఆందోళన పార్టీ నేతల్లో నెలకొంది.