ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిళ డిమాండ్
కేంద్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ఊపిరి పోసిన తెలుగుదేశం జనసేన పార్టీలు నరేంద్ర మోడీకి సలాం కొడుతూ, 18 మంది ఎంపీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిళ తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న జేడీఎస్ తమ రాష్ట్రంలో ఉక్కు కర్మాగారానికి 15వేల కోట్లు మంజూరు చేయించుకుంటే 18 మంది ఎంపీలు ఉండి, కేంద్రంలో ప్రభుత్వం నిలవడానికి కారకులైన టీడీపీ, జనసేన ఎంపీలు విశాఖ ఉక్కుకు సమాధి కడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉన్నది ముమ్మాటికీ సవతి తల్లి ప్రేమే అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు అభిప్రాయపడ్డారు. మోడీకి కన్నడ ఉక్కు మీద ఉన్న ప్రేమ ఆంధ్రుల హక్కు మీద లేదని ఎద్దేవా చేశారు. ఓపక్క కేవలం 243 మంది ఉద్యోగులు ఉన్న కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు 15వేల కోట్లు మంజూరు చేసి 26వేల మంది ఉద్యోగులు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూపాయి ఆర్థిక సహాయం చెయ్యకుండా దివాళా తీయించే ఎతుగడలు వేస్తున్నారని షర్మిల అభిప్రాయపడ్డారు. ఇలా దివాళా తీయించి చివరికి మోడీ స్నేహితులకు విశాఖ స్టీల్ కర్మాగారాన్ని అమ్మె కుట్రలు జరుగుతున్నాయని షర్మిల ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజి ప్రకటించి ఆదుకోవాలని కార్మికులు 1400 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే పట్టించుకోకపోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిట్టల్ పెట్టబోయే స్టీల్ ప్లాంట్ కి ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడాలని చర్చిస్తున్నారని విమర్శించారు. కర్ణాటక స్టీల్ ప్లాంటుకు బెయిల్ అవుట్ ప్యాకేజ్ ఇచ్చినట్లే విశాఖ స్టీల్ ప్లాంట్ కు కూడా ఆర్థిక ప్యాకేజి ఇచ్చి సెయిల్ లో విలీనం చెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ కు ప్యాకేజీ సాధించలేకపోతే టీడీపీ, జనసేన ఎన్డీఏ అలయెన్స్ నుంచి బయటకు రావాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఛాలెంజ్ చేశారు.