-
బిఆర్ఎస్ విష ప్రచారాన్ని తప్పికొట్టాలి
-
ప్రభుత్వం పరంగా లబ్ది పొందిన వారి జాబితా ప్రతి గ్రామంలో ప్రదర్శిస్తాం
-
బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ఘనత
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకూ తీసుకెళ్లాలని ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న విష ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పి కొట్టాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరి పేరు గ్రామాల్లో ప్రదర్శించడం జరుగుతుందని అందుకు సంబంధించిన ఆదేశాలు అధికారులకు ఇచ్చామని మంత్రి తెలిపారు.
పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గల్లా ఎగరేసుకొని తిరగాలని సూచించారు. దేశంలో ఎవరూ చేయలేని కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేయడమేనని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని , పథకాల ద్వారా లబ్ధి పొందుతూ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసే వారి పేర్లను బయటపెడతామని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి కేంద్ర ప్రభుత్వం మనకున్న ప్రాథమిక హక్కులను కాలరాస్తుందని ఎలాంటి సిద్ధాంతం లేకుండా బిజేపి ముందుకు పోతుందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో జై భీమ్, జై సమ్మిదాన్, జై బాపు అనే కార్యక్రమాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గడపగడపకు పోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసే బాధ్యత కార్యకర్తలు నాయకులపైనే ఉందని, ఆ విధంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు.