హైదరాబాద్లోని ప్రముఖ హోటల్కు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. గడిచిన రెండు సంవత్సరాలుగా హోటల్ నిర్వాహకులు పన్ను బకారయిలు చెల్లించడం లేదు. దీనిపై పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చారు. అయినా హోటల్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పరిస్థితి గమనించిన జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఉదయం హోటల్ ని సీజ్ చేశారు.
హైదరాబాద్ సిటీలో ఫేమస్ అయిన హోటల్లో తాజ్ బంజారా ఒకటి. నిత్యం బిజీగా ఉండే ఈ హోటల్కు సెలబ్రెటీలు ఎక్కువగా వస్తుంటారు. క్రికెటర్లు ఎప్పుడు వచ్చినా ఈ హోటల్లో బస చేస్తుంటారు. అలాగే దేశంలోని కీలక రాజకీయనేతలు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే బస చేస్తారు. పార్టీ సమావేశాలకు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ మంది దీని వైపు మొగ్గుచూపుతారు. తాజ్ బంజారా హోటల్ గడచిన రెండేళ్లుగా జీహెచ్ఎంసీకి పన్ను చెల్లించలేదు. దాదాపు కోటి 40 రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దీనిపై పలుమార్లు అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా నిర్వాహకులు ఏమాత్రం స్పందించలేదు. చివరకు కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో హోటల్ ని సీజ్ చేసినట్టు చెబుతున్నారు అధికారులు. దీనిపై మాట్లాడాలని భావిస్తే, యాజమాన్యం నేరుగా ఆఫీసుకు వచ్చి మాట్లాడాలని నోటీసుల్లో ప్రస్తావించారు అధికారులు.
గత నాలుగేళ్ల కిందట తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం ఇదే విధంగా వ్యవహరించింది. అప్పుడు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు. చివరకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. లేటెస్ట్గా నోటీసులు గేటుకు అంటించి సీల్ వేశారు. పెండింగ్లో ఉన్న బకాయలు కడితే హోటల్ తిరిగి ఓపెన్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీనికి రెండురోజులు గడువు ఇచ్చినట్టు తెలుస్తోంది. గురువారం సాయంత్రం హోటల్ ఐదుగంటలకే సీజ్ చేశారు అధికారులు. కాకపోతే ఉదయాన్నే గేటు ఓపెన్ చేయకుండా సీజ్ చేశారు. ఈ విషయం తెలియగానే ఢిల్లీలో ఉన్న తాజ్ బంజారా హోటల్ ఓనర్ రియాక్ట్ అయ్యారు. రూ. 51 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ను జీహెచ్ఎంసీకి ఆర్టీజీఎస్ ద్వారా ఓనర్ చెల్లించినట్టు తెలుస్తోంది. ఇంకా మిగతా సగం సాయంత్రంలోగా కడతానని అధికారులకు చెప్పినట్టు సమాచారం. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు. సగం కట్టింది నిజమేనని చెప్పుకొచ్చారు. ఇదిలాఉండగా జీహెచ్ఎంసీలో మొత్తం 19 లక్షల 50 వేల మంది ప్రాపర్టీ టాక్స్ పేయర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు 13 లక్షల మంది మాత్రమే కట్టారు. ప్రాపర్టీ టాక్స్ కట్టని వారు ఇంకా 6 లక్షల 50 వేల మంది ఉన్నారు. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ లక్ష్యం రూ.2000 కోట్లు.
గత ఏడాది టాక్స్ల రూపంలో రూ.1900 కోట్ల రూపాయలు వసూలు చేసింది జీహెచ్ఎంసీ. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు రూ.1450 కోట్లు వసూళ్లు అయ్యాయి. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని షాపింగ్ మాల్స్, థియేటర్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లకు నోటీసులు ఇచ్చారు అధికారులు. పెండింగ్లో ఉన్న బకాయిలను కచ్చితంగా వసూలు చేయాలనే నిర్ణయానికి అధికారులు వచ్చారు. ప్రాపర్టీ ట్యాక్స్ కోసం మూడు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.