35.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం – డిప్యూటీ సీఎం భట్టి

రూ.3,000 కోట్ల బడ్జెట్‌తో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు 2 నెలల్లో అమలు చేయాలి

అద్దెలు, డైట్ చార్జీలు పెండింగ్‌లో పెట్టవద్దు

అటవీ భూముల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి

ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులు హాస్టళ్ల పర్యటన నిరంతరం కొనసాగేలా ప్రయత్నించండి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. సంక్షేమ శాఖలో పథకాల అమలుకు ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సంక్షేమ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.

గత దశాబ్ద కాలంగా పాలించిన వారు ఎస్సీ, ఎస్టీ యువతకు స్వయం ఉపాధి పథకాలు పూర్తిగా పక్కన పెట్టారని మండిపడ్డారు. రూ.3,000 కోట్ల బడ్జెట్‌తో ఎస్సీ, ఎస్టీ యువతకు రెండు నెలల వ్యవధిలో స్వయం ఉపాధి పథకాలు అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను కోరారు. ఈ భారీ ఉపాధి పథకాలకు సంబంధించిన ప్రణాళికలను వెను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులు అందరినీ ఆదేశించారు.

సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలకు సంబంధించి అద్దెలు, డైట్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. శాఖల వారీగా ఈ అంశాల్లో ఉన్న బకాయిల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బకాయిలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు బాధ్యత తీసుకొని ఆర్థిక శాఖ నుంచి బిల్లులు ఎప్పటికప్పుడు మంజూరు చేయించుకోవాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో పర్యటనలు నిరంతరం కొనసాగేలా సంక్షేమ శాఖ అధికారులు ఫాలో అప్ చేసుకోవాలని సూచించారు. పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్‌ను సంక్షేమ శాఖల అధికారులు నిత్యం ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులకు గుర్తుచేసి కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని మార్గ దర్శనం చేశారు. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం వివిధ శాఖల నుంచి ఎస్సీ, ఎస్టీ శాఖలకు రావలసిన నిధులపై కసరత్తు చేసి సీరియస్‌గా ఫాలోఅప్ చేయాలని తెలిపారు. కేంద్ర పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి నిధులు రాబట్టడంలో వేగం పెంచాలని కోరారు.

ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు అటవీ హక్కుల చట్టం కింద లక్షలాది మంది గిరిజనులకు భూ పంపిణీ జరిగిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ భూముల అభివృద్ధికి ఎస్సీ , ఎస్టీ శాఖల అధికారులు విద్యుత్తు, వ్యవసాయ, అటవీ, ఉద్యాన శాఖ అధికారులతో సంయుక్తంగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ భూముల్లో సోలార్ పవర్ ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని పెంచడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు అవకాడో, వెదురు వంటి పంటల సాగుకు ప్రణాళికలు రచించి రాబోయే రెండు సంవత్సరాల్లో ఫలితాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.

ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేపట్టి ఆ వర్గాల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సంక్షేమ శాఖ అధికారులు ఆయా వర్గాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఏ సూచన చేసిన అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎస్సీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ఎస్టీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ హరిత, ఇరిగేషన్ సెక్రటరీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com