సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన వీరిద్దరికి మరో షాక్ ఇచ్చింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. నిజానికి వీరిద్దరిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమి మీదకు చేర్చాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు వీరి రాక మరింత ఆలస్యం కానున్నట్టు ప్రకటించింది నాసా. ఈ ఏడాది జూన్ 5న బోయింగ్కు చెందిన స్టార్లైనర్లో వీరిద్దరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లారు. వారం రోజుల్లో రావాల్సిన వీరిద్దరు ముందుగా అనుకున్న ప్రకారం వారం రోజులకే తిరిగి రావాలి. కానీ స్టార్లైనర్లో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. స్పేస్ఎక్స్కు చెందిన స్పేష్ షిప్ సాయంతో ఫిబ్రవరిలో తీసుకొస్తామని ఇంతకు ముందు నాసా చెప్పింది. కానీ ప్రస్తుతం వారు మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలి వారంలో భూమిని చేరుకునే అవకాశం ఉందంటూ షాకింగ్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.
ఈ పరిణామాలను చూస్తుంటే 8 రోజులనుకొని వెళ్లిన వీరి యాత్ర ఏకంగా 9 నెలలు పొడిగించినట్టైంది. నిజానికి ఐఎస్ఎస్ నుంచి తీసుకొచ్చే క్రమంలో భూమి నుంచి వ్యోమగాములను పంపించింది. సెప్టెంబరు 29న ఫ్లోరిడాలోని కేప్ కెనరవాల్ నుంచి ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇద్దరు వ్యోమగాములు అందులో వెళ్లగా.. మరో రెండు సీట్లు ఖాళీగా ఉంచారు. తిరుగు ప్రయాణానికి స్పేస్ఎక్స్ సమయం కోరడంతో వారి రాక ఆలస్యం అవుతోన్నట్టు తెలుస్తోంది. జనవరి చివరవారం లేదా ఫిబ్రవరిలో చేపట్టాల్సిన ప్రయోగం.. మార్చికి వాయిదాపడినట్టు తెలుస్తోంది. న్యూ డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం పడుతుందని, దీంతో ప్రయోగం ఆలస్యమవుతుందని నాసా తెలిపింది. అస్టోనాట్స్ను సురక్షితంగా తీసుకురావడమే తమ లక్ష్యమని.. అందుకే ఈ ప్రయోగం ఆలస్యమవుతుందని తెలిపింది.
అయితే సునీతా ఆరోగ్యంపై అనేక అనుమానాలు ఉన్నాయి. రీసెంట్గా వైరల్ అయిన ఫోటోల్లో ఆమె చాలా బక్కగా కనిపిస్తున్నారు. అంతరిక్షంలో వ్యోమగాములకు ‘స్పేస్ ఎనీమియా’ రోగం వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మైక్రో గ్రావిటీ పరిస్థితుల్లో ఎర్ర రక్తకణాలు వేగంగా క్షీణిస్తాయనీ… శరీరంలో ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకునేందుకు శరీరం ఎర్ర రక్తకణాలను నాశనం చేస్తూ సమతుల్యతను కాపాడుతుందని అంటున్నారు. దీని వలన అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు బయటపడుతాయని చెబుతున్నారు.
అయితే సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన కథనాలపై నాసా తాజాగా స్పందించింది. ఆస్ట్రోనాట్ల ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చింది. సునీతా విలియమ్స్ సహా అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. వ్యోమగాములకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరుగుతాయని, ఫ్లైట్ సర్జన్లు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారని వెల్లడించింది. సునీత ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేసింది.