డీన్ వేధింపులే కారణం అంటున్న తల్లిదండ్రులు
యూనివర్శిటీ వర్గాల వేధింపులు భరించలేక ఆంధ్రప్రదేశ్ లో ని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో చదువుతున్న ఒక విద్యార్థి క్యాంపస్ లో ఉన్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజధాని అమరావతి పరిధిలోని నీరుకొండలో ఉన్న ఎస్ఆర్ఎమ్ యూనివర్శిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న చంబేటి సుభాష్ అనే విద్యార్థి మంగళవారం ఉదయం యూనివర్శిటీ ఆవరణలోనే భవనంపై నుంచి దూకి ఆత్మహ్యత చేసుకున్నాడు. సుభాష్ స్వస్ధలం నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట. సుభాష్ మృతదేహాన్ని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు సీఎస్ఈ విభాగం డీన్ వేధింపులే కారణమని తెలుస్తోంది. సుభాష్ తల్లిదండ్రులు కూడా యూనివర్శటీ వర్గాల మొండి వైఖరి కారణంగా తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కన్నీరు మున్నీరవుతున్నారు. కళాశాలలో అటెండెన్స్ తక్కువగా ఉందనే వంకతో వార్షిక పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో కలత చెంది తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని సుభాష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఈ సంవత్సరం దాదాపు 500 మంది విద్యార్థులకు హజరు తక్కువ ఉందని వార్షిక పరీక్షలు రాయడానికి యూనివర్శిటీ యాజమాన్యం నిరాకరించింది. ఇందులో అనోరోగ్య కారణాలు, ఇతరత్రా జన్యూన్ రీజన్స్ వల్ల కళాశాలకు హాజరవ్వలేకపోయిన వారిని కూడ… వారి డాక్టర్ సర్టిఫికేట్లు డీపార్ట్మెంట్ డీన్ కు సమర్పించినా పరీక్షలు రాయడానికి ఒప్పుకోలేదు. యూనివర్శిటీ మొండి వైఖరితో తమ పిల్లల భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందో అనే ఆందోళనతో తల్లిదండ్రులు స్వయంగా వెళ్లి యూనివర్శిటీ రిజిస్ట్రార్, డీన్ లను కలిసినా వాడు తల్లిదండ్రుల వివరణ వినడానికి కూడా ఇష్టపడకుండా మొండిగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సుభాష్ తల్లిదండ్రులు కూడా సీఎస్ఈ విభాగం డీన్ తో మాట్లాడటానికి సూళ్ళూరు పేట నుంచి మంగళవారం నీరుకొండలోని ఎస్ఆర్ఎమ్ క్యాంపస్ కి వచ్చారు. అయితే సుభాష్ తల్లిదండ్రులు ఎంత బతిమాలినా పరీక్షలు రాయించడానికి డీన్ ఒప్పుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్రంగా కలత చెందిన సుభాష్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటెండెన్స్ కారణంగా తనను వార్షిక పరీక్షలు రాయడానికి అనుమతించకపోవడంతో గడచిన నెల రోజులుగా సుభాష్ తోటి విద్యార్థులతో ముభావంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. నెలరోజులుగా సుభాష్ తీవ్రమైన డిప్రెష్లో ఉన్నట్లు అతని సహాధ్యాయులు చెపుతున్నారు. ప్రస్తుతం యూనివర్శిటీ క్యాంపస్ లో తవ్ర నిర్బంధ వాతావరణం నెలకొంది. సుభాష్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో విద్యార్థులు ఎవ్వరినీ హాస్టల్ గదులు, తరగతి గదులు దాటి రానివ్వడం లేదు.